రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం
ABN , Publish Date - Jul 01 , 2026 | 07:26 AM
రాజస్థాన్లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. దౌసా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు, నిలిపి ఉంచిన ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
దౌసా, జులై 1: రాజస్థాన్లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. దౌసా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు, నిలిపి ఉంచిన ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
స్థానిక సమాచారం ప్రకారం.. బస్సు వేగంగా వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న ట్రక్కును వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు క్షణాల వ్యవధిలోనే బస్సులో భారీగా మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు నిద్రమత్తులో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి.
ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 22 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి అతివేగమే కారణమా లేక డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!