నీట్ పేపర్ లీక్ కేసు.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు..
ABN , Publish Date - May 17 , 2026 | 02:59 PM
నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఢిల్లీ: నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పేపర్ లీక్ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. తాజాగా ప్రధాని మోదీకి మరోసారి పలు ప్రశ్నలు సంధిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా సంబంధిత కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోవడం, ప్రధాని మౌనంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ పోస్టు..
'నీట్ 2024 పేపర్ లీక్ అయింది. పరీక్ష రద్దు కాలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదు. సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఘటనపై నిజానిజాలు తేల్చేందుకు కేంద్రం కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నీట్ 2026లోనూ పేపర్ లీక్ అయింది. పరీక్ష రద్దు అయింది. అయినా సంబంధిత కేంద్ర మంత్రి రాజీనామా చేయలేదు. సీబీఐ మళ్లీ దర్యాప్తు చేస్తోంది. మరో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
మోదీ గారూ.. దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. వాటికి సమాధానం చెప్పండి. పేపర్ లీక్ ఘటనలు పదేపదే ఎందుకు జరుగుతున్నాయి?. ఈ పరీక్షా పత్రాల లీక్పై మీరు ఎప్పుడూ ఎందుకు మౌనం వహిస్తున్నారు?. పదేపదే విఫలమవుతున్న విద్యాశాఖ మంత్రిని ఎందుకు తొలగించడం లేదు?' అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
నీట్ పేపర్ లీక్.. 14 రోజుల సీబీఐ కస్టడీకి నిందితురాలు
భారత్కు చేరుకున్న మరో ఎల్పీజీ ట్యాంకర్