నీట్ పేపర్ లీక్.. 14 రోజుల సీబీఐ కస్టడీకి నిందితురాలు
ABN , Publish Date - May 17 , 2026 | 01:32 PM
నీట్ పేపర్ లీక్ కేసులో నిందితురాలు మనీషా మంధారేకు కోర్టు 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టైన నిందితురాలు మనీషా మంధారే విచారణ కోసం కోర్టు ఆమెను 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జీవశాస్త్ర నిపుణురాలైన ఆమెను సీబీఐ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇక లీకేజీ సూత్రధారి, నీట్ కమిటీలో రసాయనశాస్త్ర నిపుణుడిగా ఉన్న పీవీ కులకర్ణిని సీబీఐ శుక్రవారమే అరెస్టు చేసింది. నీట్ ప్రశ్నపత్రం రూపకల్పనలో సభ్యులుగా ఉన్న వారికి మొత్తం ప్రశ్నలు తెలిసే అవకాశం తక్కువగా ఉండటంతో ఇతర సబ్జెక్టుల నిపుణులతో కలిసి కులకర్ణి లీకేజీకి పాల్పడినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.
పేపర్ లీకేజీలో మనీషా మంధారే కీలకంగా వ్యవహరించారని కోర్టుకు సీబీఐ తెలిపింది. బోటనీ, జువాలజీ ప్రశ్నపత్రాల అనువాదంలో ఆమె నిపుణురాలని పేర్కొంది. కులకర్ణితో పాటు మనీషా మంధేరే, మనీషా వాఘ్మరే ఈ కుట్రలో కీలక పాత్రధారులని తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా రెయిడ్స్, విచారణ జరుగుతున్నాయని న్యాయస్థానానికి సీబీఐ వెల్లడించింది. ఈ క్రమంలో మంధారేను విచారించేందుకు 14 రోజుల కస్టడీ కావాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి వివిధ ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్లి విచారించి, ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్
వాహనదారులపై ఇంధన భారం.. మరోసారి పెరిగిన సీఎన్జీ ధరలు