Share News

తప్పుడు విదేశాంగ విధానం వల్లే ఎల్పీజీ కొరత.. పార్లమెంటు ఆవరణలో రాహుల్ నిరసన

ABN , Publish Date - Mar 12 , 2026 | 03:10 PM

ఇంధన భద్రత విషయంలో కేంద్రం రాజీ పడిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో విపక్షాలు గురువారంనాడు నిరసనకు దిగాయి.

తప్పుడు విదేశాంగ విధానం వల్లే ఎల్పీజీ కొరత.. పార్లమెంటు ఆవరణలో రాహుల్ నిరసన
Rahul Gandhi

న్యూఢిల్లీ: ఇంధన భద్రత విషయంలో కేంద్రం రాజీ పడిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో విపక్షాలు గురువారంనాడు నిరసనకు దిగాయి. రాహుల్ గాంధీ ఈ నిరసనలో పాల్గొంటూ... సమస్య సంక్షోభంగా మారకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని అన్నారు.


rahul.jpg

'విదేశాంగ విధానాన్ని ప్రభుత్వం మార్చుకోవాల్సి అవసరం ఉంది. గ్యాస్, పెట్రోల్ సమస్యగా మారబోతున్నాయి. ఇంధనం సమస్యగా మారనుంది. దీనికంతటికీ ఇంధన భద్రతపై ప్రభుత్వం రాజీపడటమే కారణం. లోపభూయిష్ఠమైన ఇంధన విధానమే సమస్యను తెచ్చిపెట్టింది' అని రాహుల్ గాంధీ విమర్శించారు. సమస్య సత్వర పరిష్కారానికి ప్రధానమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని, తగిన సన్నాహకాలు చేయకుంటే కోట్లాది మంది ప్రజలు ఇక్కట్ల పాలవుతారని అన్నారు. ఈ సందర్భంగా సహచర ఎంపీలతో కలిసి ఛాయ్‌లో బిస్కెట్లు ముంచుకుంటూ రాహుల్ తిన్నారు. గ్యాస్ సంక్షోభం కారణంగా ఛాయ్, బిస్కెట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని నిరసన తెలిపారు.


నామ్ నరేందర్, కామ్ సరెండర్ నినాదాలు

పార్లమెంటు మకర ద్వారం వద్ద విపక్షాలు జరిపిన నిరసనలో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్‌పీ తదితర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. 'నామ్ నరేందర్, కామ్ సరెండర్', 'మోదీ జీ, ఎల్పీజీ' అంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఇటుకలతో ఏర్పాటు చేసిన వంట పొయ్యిలతో ప్రియాంక గాంధీ తదితర మహిళా ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం, భారత్‌పై పడుతున్న ప్రభావంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

నేనెప్పుడూ ఆ నియమాలు ఉల్లంఘించలేదు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కామెంట్స్

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. భారీ భద్రత మధ్య సమావేశాలు

Updated Date - Mar 12 , 2026 | 04:18 PM