ప్రతిభావంతులకు స్వర్గధామంగా భారత్: మోదీ
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:29 AM
ప్రతిభావంతులకు స్వర్గధామంగా భారత్ ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించుకోవడంపై దేశ యువత ఆసక్తి కనబరుస్తోందని ఆయన తెలిపారు.
ఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రతిభావంతులకు స్వర్గధామంగా భారత్ ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించుకోవడంపై దేశ యువత ఆసక్తి కనబరుస్తోందని ఆయన తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు'(India AI Impact Summit) జరుగుతోంది. గురువారం ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ(Narendra Modi AI speech) మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ అని పేర్కొన్నారు.
'ఏఐ సమ్మిట్(India AI Impact Summit) నిర్వహణ భారత్కే కాదు.. దక్షిణాసియాకే గర్వకారణం అవుతుంది. కొత్త సాంకేతికతను భారత్ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. ప్రతిభావంతులకు స్వర్గధామంగా భారత్ ఉంది. ఏఐ కేంద్రంగా ఇండియా మారుతోంది. ఏఐ అనేది ఓ పరివర్తన శక్తి. దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుంది. ఏఐ అనేది యువత, భారత్కు కొత్త విశ్వాసం, ఆస్తిగా ఉంది. తొలినాళ్లలో ఏఐపై అనేక సందేహాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏఐని యువత ప్రయోజనకరంగా ఉపయోగిస్తోంది. వివిధ రంగాల సమస్యలకు ఏఐ పరిష్కారం చూపుతోంది' అని మోదీ తెలిపారు.
'స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీకి భారత్ కేంద్రంగా ఉంది. ఏఐ సామర్థ్యం ఆలోచనలకు అందనంత దూరంగా ఉంది. అలానే మానవ కేంద్రీకృత కృత్రిమ మేధ నిర్మాణం మన లక్ష్యం కావాలి. రానున్న రోజుల్లో ఏఐ ఏం చేస్తోందనేది కాదు, ప్రస్తుతం మనం ఏఐతో ఏం చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. కృత్రిమ మేధ(ఏఐ) అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటింది. అందుకే దాన్ని ప్రయోజనకారిగా వినియోగించుకోవాలి. గతంలో అణు పదార్థంతో సంక్షోభాన్ని చూశాము.. అలానే మంచినీ చూశాం. అదే విధంగా ఏఐతోనూ మంచి చేయడానికి ప్రయత్నించాలి. ఏఐ మనల్ని కాదు.. మనం ఏఐని శాసించేలా మారాలి' అని మోదీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
రఫేల్ ఫైటర్లలో.. భారత్ వాటా పెంచాలి
హైదరాబాద్లో తల్లీబిడ్డల ఆత్మహత్య కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే