విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ABN , Publish Date - Jun 08 , 2026 | 09:21 PM
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన భారీ ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.
న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సోమవారం జరిగిన భారీ ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. బాధితులకు అవసరమైన తక్షణ సహాయాన్ని స్థానిక అధికారులు అందజేస్తారని తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు.
మృతుల కటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయక నిధి నుంచి రూ.2 లక్షల పరిహారాన్ని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 సాయం అందజేస్తామని తెలిపారు.
ప్రమాదం ఇలా..
విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మోల్టెన్ మెటల్ ల్యాడల్ నుంచి బకెట్లు కుప్పకూలాయి. ల్యాడల్లో ఉన్న ద్రవ లోహం అకస్మాత్తుగా కిందపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ప్రమాదస్థలిలో 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలపై అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కార్మికుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాద కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. 8 మంది మృతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి