రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ రిపబ్లిక్ డే సందేశాలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:44 PM
భారత 77వ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు.
న్యూ ఢిల్లీ, జనవరి 26: భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో దేశ ప్రజలకు సందేశమిచ్చారామె. 'మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ జీవితం.. ఆనందం, శాంతి, భద్రత, సామరస్యంతో నిండి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను' అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.
2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత సైనిక పురస్కారం 'అశోక చక్ర'ను ప్రదానం చేశారు. యాక్సియమ్-4 మిషన్ చేపట్టిన సమయంలో గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అసాధారణ ధైర్యంతో పాటు ఆయన సంకల్పానికి గౌరవంగా రాష్ట్రపతి ఆయన్ను సత్కరించారు.
నరేంద్ర మోదీ శుభాకాంక్షలు..
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో ఒక సందేశం పోస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా వికసిత్ భారత్ను నిర్మించాలనే మన సమష్టి సంకల్పంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందించాలని ఆకాంక్షించారు మోదీ.
గణతంత్ర దినోత్సవం మన స్వేచ్ఛ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు శక్తిమంతమైన చిహ్నమని ప్రధాని తెలిపారు. ఈ పండుగ దేశాన్ని కలిసి నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగడానికి మనకు కొత్త శక్తిని, ప్రేరణను ఇస్తుందన్నారు.
'గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశవాసులందరికీ అనేకానేక శుభాకాంక్షలు. భారతదేశ గర్వం, కీర్తికి ప్రతీక అయిన ఈ జాతీయ పండుగ.. మీ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలి. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సంకల్పం మరింత బలపడాలి' అని ఎక్స్ వేదికగా ప్రధాని పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకమైనదని మోదీ అన్నారు. ఆమె ప్రసంగం ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, రాజ్యాంగ విలువలను రక్షించడానికి, ఇంకా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి వారి నిబద్ధతను బలోపేతం చేయడానికి ప్రేరేపిస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం
ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
Read Latest National News