Share News

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. లోక్‌సభలో ప్రధాని మోదీ

ABN , Publish Date - Mar 23 , 2026 | 02:23 PM

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందన్న ప్రధాని.. పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులున్నారని, వారి రక్షణకు చర్యలు చేపట్టామని లోక్‌సభకు వెల్లడించారు.

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. లోక్‌సభలో ప్రధాని మోదీ
PM Modi Lok Sabha speech

న్యూఢిల్లీ, మార్చి 23: పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన లోక్‌సభలో మధ్యప్రాచ్యంలో యుద్ధం గురించి ప్రసంగించారు. మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోందన్న ప్రధాని మోదీ.. భారత్‌ ఇంధన అవసరాలను పశ్చిమాసియా తీరుస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ యుద్ధం భారత్‌కు ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందని మోదీ అన్నారు. ప్రజలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోందని కూడా ప్రధాని మోదీ వెల్లడించారు.


పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులు ఉన్నారని, గల్ఫ్‌లో ఉన్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని ప్రధాని మోదీ లోక్ సభలో చెప్పారు. 24 గంటలూ కంట్రోల్‌ రూమ్స్‌, హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటు చేశామని, 3.75 లక్షల మంది భారతీయులు క్షేమంగా వెనక్కి వచ్చారని మోదీ తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఆయిల్‌, గ్యాస్‌, ఎరువుల సరఫరాకు హోర్ముజ్ జలసంధి కీలకమని మోదీ చెప్పారు. ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలో 60 శాతం LPG ఉత్పత్తి చేస్తున్నామని, 41 దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. దేశంలో 53 లక్షల మెట్రిక్‌ టన్నుల పెట్రోల్‌ రిజర్వ్స్‌ ఉన్నాయని, హోర్ముజ్ నుంచి మరిన్ని నౌకలు భారత్‌కు వస్తున్నాయని మోదీ వెల్లడించారు.

రైల్వేల విద్యుదీకరణతో 180 కోట్ల లీటర్ల డీజిల్‌ ఆదా అయిందని కూడా మోదీ లోక్ సభలో చెప్పారు. ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు పొంచి ఉందన్న ప్రధాని, భారత్‌పై మాంద్యం ప్రభావం పడకుండా చూస్తున్నామని, ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని మోదీ అన్నారు. ఖరీఫ్‌లో రైతులకు డీజిల్‌ కొరత లేకుండా చూస్తున్నామని, పవర్‌ ప్లాంట్స్‌కు కావాల్సినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. గల్ఫ్‌ సంక్షోభంపై పార్లమెంట్‌ మొత్తం ఒకే గళం వినిపించాలని మోదీ ఈ సందర్భంగా కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు

Updated Date - Mar 23 , 2026 | 03:05 PM