Share News

వారం రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:56 PM

వారం రోజుల విదేశీ పర్యటన నిమిత్తం శనివారం బయల్దేరారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో ఆయన ఆ దేశ అగ్ర నాయకులతో భేటీ కావడం సహా పలువురు వ్యాపార ప్రముఖులతోనూ సంభాషించనున్నారు. ఆ తర్వాత జూన్ 16, 17న ఫ్రాన్స్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.

వారం రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..
PM Narendra Modi

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్, స్లోవేకియాల వారం రోజుల పర్యటనకు శనివారం బయలుదేరారు. అక్కడ ఆయన జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం సహా పలువురు ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలూ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారతదేశ వ్యూహాత్మక దార్శనికతలో ఫ్రాన్స్‌ను ఓ కీలక భాగస్వామిగా అభివర్ణించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించినప్పటి నుంచి సాధించిన పురోగతిని సమీక్షించడంపై.. తాను ఇమ్మానుయేల్ మెక్రాన్‌తో సమావేశం కానున్నట్టు తెలిపారు. ఈ భేటీలో ఇరు దేశాధినేతలు పలు ప్రధాన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపైనా చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.


ఫ్రాన్స్ పర్యటన అనంతరం.. స్లోవేకియాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. 1993లో ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఓ భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడమిదే తొలిసారి కావడం విశేషం. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రీని, ప్రధాని రాబర్ట్ ఫికోలను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలలో ఈ పర్యటనను ఓ చరిత్రాత్మక మైలురాయిగా ఆయన అభివర్ణించారు.

ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారత్ పాల్గొనడాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. వరుసగా ఎనిమిదో సారి ఆహ్వానం అందడం గొప్ప అవకాశంగా భావించారు. దీంతో భారత్‌పై దాని అంతర్జాతీయ భాగస్వాములు ఉంచిన విశ్వాసం, ప్రపంచవ్యాప్తంగా భారత్ విస్తరిస్తున్న ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ అన్నారు. 'జీ7లో భారత్ తన వాదనను మాత్రమే వినిపించదు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలపైనా గళం విప్పుతుంది' అని చెప్పుకొచ్చారు మోదీ.


ప్రధాని పర్యటన వివరాలిలా..

  • జూన్ 14, 15: స్లోవేకియాకు స్వాతంత్ర్యం వచ్చాక అక్కడ పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ గుర్తింపు పొందనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రీని, ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోలతో చర్చలు జరపడం సహా పలువురు వ్యాపార ప్రముఖులనూ కలవనున్నారు.

  • జూన్ 16-17: ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశానికి మోదీ హాజరుకానున్నారు. కీలకమైన ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై అంతర్జాతీయ నాయకులతో చర్చలు జరపనున్నారు. గ్లోబల్ సౌత్ అంశాలపైనా గళమెత్తే అవకాశముంది.

  • జూన్ 18: పారిస్‌లో జరిగే వివాటెక్ 2026కు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్‌తో పాటు మోదీ హాజరుకానున్నారు. అక్కడ ఫ్రాన్స్‌లోని భారతీయులతో సంభాషించనున్నారు.


అజెండా ఇదే..

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ పర్యటన నైస్‌లో ప్రారంభమౌతుందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమం.. పర్యావరణ వ్యవస్థలోని ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, కీలక భాగస్వాములను ఒకవేదికపై చేర్చనుంది. 'ఎన్‌డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలోని అభివృద్ధికి బలంగా కృషి చేస్తోంది. 12 ఏళ్లలో దేశంలోని యువత ఆత్మవిశ్వాసంతో తమ ఆకాంక్షలను సాధించడం విశేషం' అని మోదీ చెప్పారు.


ఇవీ చదవండి:

అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం.. పైలట్ మృతి.!

వరుస విజయాలతో దేశ రక్షణ రంగంలో డీఆర్‌డీఓ సరికొత్త చరిత్ర

Updated Date - Jun 13 , 2026 | 01:18 PM