రాజీనామా దిశగా నితీశ్ కుమార్.. రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:59 PM
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని, నితీశ్ తనయుడు నిషాంత్ కుమార్ బిహార్ ఉప ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది.
పట్నా: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kuamr) తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని, అలాగే నితీశ్ తనయుడు నిషాంత్ కుమార్ బిహార్ ఉప ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. తద్వారా నితీశ్ కుమార్ స్థానంలో బీజేపీ తమ సొంత అభ్యర్థిని ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా, నిషాంత్ కుమార్ను రాజ్యసభకు నామినేట్ చేయవచ్చనే ప్రచారం కూడా ఇంతకుముందు జరిగింది. అయితే ఇంతవరకూ ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు సిద్ధం కాలేదు. నిషాంత్ కుమార్ యాక్టివ్ పాలిటిక్స్లోకి అడుగుపెట్టడం ఖాయమని మాత్రం జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. బిహార్లో 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జేడీయూ రెండు స్థానాలకు గెలుచుకునే అవకాశం ఉంది. జేడీయూ శాసనసభా పక్షం కూడా గురువారం నాడు సమావేశమవుతోంది. ఈ సమావేశంలో కేంద్రంలో నితీశ్ ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరించే విషయంపై చర్చ జరగవచ్చని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200 సీట్లకు పైగా స్థానాలను గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షమైన జేడీయూ 85 స్థానాలతో రెండో స్థానంలోనూ, లోక్జన్శక్తి పార్టీ (రామ్విలాస్) 19 స్థానాలతో మూడో స్థానంలోనూ నిలిచాయి.
ఇవి కూడా చదవండి..
మోదీ పర్యటన తర్వాత ఇరాన్పై దాడులు.. ఇజ్రాయెల్ రాయబారి ఏమన్నారంటే..