Share News

నేపాల్ వరదలు.. నలుగురు భారతీయులను రక్షించిన నేపాల్ ఆర్మీ

ABN , Publish Date - Aug 29 , 2026 | 07:30 PM

నేపాల్‌లో వరదల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక వివరాలను వెల్లడించింది. రసువా ప్రాంతంలోని ఓ జలవిద్యుత్‌ ప్రాజెక్టు నుంచి నలుగురు భారతీయులను నేపాల్ ఆర్మీ రక్షించి కాఠ్మండుకు తరలించింది.

నేపాల్ వరదలు.. నలుగురు భారతీయులను రక్షించిన నేపాల్ ఆర్మీ
Nepal Army Rescue

న్యూఢిల్లీ: నేపాల్‌లో వరదలు, సహాయక చర్యల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. రసువా ప్రాంతంలోని ఓ జలవిద్యుత్‌ ప్రాజెక్టు నుంచి నలుగురు భారతీయులను నేపాల్ ఆర్మీ రక్షించింది. రిపు కుమార్, చనేశ్వర్ నార్జరీ, కృపా శంకర్, మహమ్మద్ మిన్హాజుద్దీన్‌లను సురక్షితంగా కాఠ్మండుకు తరలించారు.

కాఠ్మండుకు ఫోరెన్సిక్ బృందాలు

వరదల కారణంగా మృతిచెందిన వారి మృతదేహాలను గుర్తించేందుకు భారత ఫోరెన్సిక్‌ బృందాలు నేపాల్‌కు చేరుకున్నాయి. డీఎన్‌ఏ నమూనాల సేకరణ, గుర్తింపు ప్రక్రియ కోసం ఆరుగురు ఫోరెన్సిక్‌ నిపుణులతో కూడిన బృందాలు కాఠ్మండుకు వెళ్లాయి.


సొరంగంలో రెస్క్యూ చర్యలు

వరద ప్రభావిత ప్రాంతంలోని ఓ సొరంగంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని కూడా భారత్‌ నేపాల్‌కు పంపింది. సొరంగంలో రెస్క్యూ చర్యలకు సంబంధించిన పనులను ఈ బృందం చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. సొరంగంలో సహాయక చర్యలను పరిశీలించేందుకు భారత్‌ నుంచి పంపిన పరిశీలన బృందం నిన్న కాఠ్మండుకు చేరుకుంది. ఈ బృందం ఈ రోజు నుంచి తన పనిని ప్రారంభించింది.

చైనా నుంచి 120 మంది భారతీయులు నేపాల్‌కు

చైనా నుంచి 120 మంది భారతీయులు ఈ రోజు నేపాల్‌లోకి ప్రవేశించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు వరదల ప్రభావిత ప్రాంతాల్లో 88 మంది భారతీయులను రక్షించినట్లు తెలిపింది.

తప్పిపోయిన 287 మంది భారతీయులు

నేపాల్‌లో ప్రస్తుతం 287 మంది భారత పౌరులు తప్పిపోయినట్లు సమాచారం. అలాగే భారత సంతతికి చెందిన 128 మంది కనిపించకుండా పోయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక, రెస్క్యూ బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయి.


Also Read:

మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీస్.. మండిపడుతున్న నెటిజన్లు..

వయసు పెరిగే కొద్దీ కండరాలు బలహీనపడుతున్నాయా? ఇది తెలుసుకోండి

Updated Date - Aug 29 , 2026 | 07:50 PM