Share News

మార్చి 31 కల్లా నక్సలిజానికి చెల్లుచీటీ : అమిత్‌షా

ABN , Publish Date - Feb 08 , 2026 | 07:53 PM

నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, అధికారులతో రాయ్‌పూర్‌లో అదివారంనాడు సమీక్షా సమావేశం జరిపినట్టు అమిత్‌షా తెలిపారు. సెక్యూరిటీ టీమ్‌లను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీలు వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలను ఇచ్చినట్టు చెప్పారు.

మార్చి 31 కల్లా నక్సలిజానికి చెల్లుచీటీ : అమిత్‌షా
Amit Shah

రాయ్‌పూర్: వామపక్ష తీవ్రవాదంపై పోరాటంలో కేంద్రం చేపట్టిన వ్యూహం సత్ఫలితాలను ఇస్తోందని, ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుదముట్టిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తెలిపారు. మరి కొద్ది వారాల్లో కేంద్రం ప్రకటించిన గడువు ముగుస్తుండటంతో రాయ్‌పూర్‌లో అమిత్‌షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను సమీక్షించారు. అనంతరం ఆ వివరాలను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన తెలియజేశారు.


నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, అధికారులతో రాయ్‌పూర్‌లో అదివారంనాడు సమీక్షా సమావేశం జరిపినట్టు అమిత్‌షా తెలిపారు. సెక్యూరిటీ టీమ్‌లను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీలు వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలను ఇచ్చినట్టు చెప్పారు. మార్చి 31వ తేదీలోగా దేశంలో నక్సలిజాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తామని వివరించారు.


రాయ్‌పూర్‌ అటల్ నగర్‌లోని ఒక హోటల్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, హోం వ్యవహారాల శాఖ స్పెషల్ సెక్రటరీ (అంతర్గత భద్రత) తదితరులు పాల్గొన్నారు. సీఆర్‌పీఎప్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్స్‌, ఛత్తీస్‌గడ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖాండ్, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.


2024 నుంచి..

ఛత్తీస్‌గఢ్‌లో 2024 నుంచి సెక్యూరిటీ బలగాలు పైచేయి సాధించాయి. 500 మందికి పైగా నక్సలైట్లు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. వీరిలో సీపీఐ (మావోయిస్టు) సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు (బసవరాజు) సహా పలువురు కీలక నేతలున్నారు. ఇదే సమయంలో సుమారు 1,900 మంది నక్సల్స్‌ను అరెస్టు చేయగా, 2,500 మంది లొంగిపోయారు.


ఇవి కూడా చదవండి..

1.25 కోట్ల హిందువులకు అండగా నిలబడతాం.. బంగ్లాదేశ్‌కు ఆర్ఎస్ఎస్ చీఫ్ హెచ్చరిక

భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..

Updated Date - Feb 08 , 2026 | 07:57 PM