కదంతొక్కిన యువతరం
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:31 AM
ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది..
సీజేపీ దేశ వ్యాప్త నిరసనల పిలుపునకు భారీ స్పందన
న్యూఢిల్లీ, జూలై 24: ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది. విద్యార్థి, యువజన సంఘాలతోపాటు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండించిన నిరసనకారులు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. కోల్కతాలో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జితో నిరసనలు హింసాత్మకంగా మారాయి. దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎ్సఏ) ఆధ్వర్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వందలాది విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. ఢిల్లీలో శుక్రవారం కూడా పలు మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్ ఆంక్షలు కొనసాగాయి. ముంబైలో శివసేన(యూబీటీ) ఆధ్వర్యంలో వేలాది మంది నిరసనలో పాల్గొన్నారు. పుణెలో భారీ వర్షంలోనూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వృత్తి నిపుణులు ర్యాలీ చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ విద్యార్థి తల్లి నాగ్పూర్లో జరిగిన నిరసనలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఛండీగఢ్లో విద్యార్థులు, రైతులు, న్యాయవాదులు కలిసి నిరసన తెలిపారు. ఇక, కర్ణాటకలో విద్యార్థి, యువజన, దళిత సంఘాలు, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కొన్ని చోట్ల వాగ్వాదాలు, తోపులాటలతో ఉద్రిక్తలు తలెత్తగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. మరోపక్క, బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టిన బీజేపీ శ్రేణులపై జరిగిన దాడులను ఖండిస్తూ బీజేపీ నేతలు శుక్రవారం నిరనన చేపట్టారు. ఇక, ఎస్ఎ్ఫఐ, ఏఐఎ్సఎఫ్, పీడీఎ్సయూ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో విద్యాసంస్థలు బంద్ పాటించాయి. మరోపక్క, జాతీయ స్థాయి పరీక్షలను రద్దు చేయాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ తమిళనాడులో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు శుక్రవారం మరింత ఉధృతంగా జరిగాయి. విద్యార్థులు లోక్భవన్ను ముట్టడికి యత్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News