Share News

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:03 PM

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులను కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల 'అధికారిక విధి' కాదని తేల్చి చెప్పింది. నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..
Custodial Death Case

ఇండోర్: కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులను కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల 'అధికారిక విధి' కాదని తేల్చి చెప్పింది. నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇండోర్ జిల్లా కోర్టు ఉద్యోగి పంకజ్ వైష్ణవ్ కస్టోడియల్ డెత్ కేసులో పోలీసుల పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ గజేంద్ర సింగ్ సంచలన ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా కస్టోడియల్ మరణాలపై హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.


సభ్య సమాజంలో కస్టోడియల్ మరణాలు అత్యంత ఘోరమైన నేరాలని మధ్యప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, రికార్డులు ఫోర్జరీ చేయడం పోలీసుల విధి నిర్వహణ కిందికి రావని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల ముందస్తు అనుమతి నిబంధన (Sanction) ఈ కేసులో వర్తించదని వెల్లడించింది. భోపాల్ ఎయిమ్స్ ఆస్పత్రి పోస్టుమార్టం నివేదికలో బాధితుడిపై పోలీసుల హింస నిజమేనని తేలిందని కోర్టు ప్రస్తావించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పోలీసులకు రక్షణ కవచాలు ఉండవని స్పష్టం చేసింది. విచారణకు ముందస్తు అనుమతి అవసరం లేదన్న కోర్టు తీర్పుతో నిందితులైన పోలీసులపై విచారణకు మార్గం సుగమమైంది.


కేసు ఏంటి?

ఇండోర్‌లోని జిల్లా కోర్టులో క్లాస్-IV ఉద్యోగిగా పంకజ్ వైష్ణవ్ (24) పని చేసేవారు. 2015 డిసెంబర్‌లో ఓ స్కూటర్ దొంగతనం చేసినట్లు వైష్ణవ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు డిసెంబర్ 19న ఇండోర్‌లోని ఎంఐజీ పోలీస్ స్టేషన్‌కు అతన్ని తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి పోలీసుల అదుపులో ఉండగానే వైష్ణవ్ ప్రాణాలు కోల్పోయాడు. విచారణ సందర్భంగా వైష్ణవ్‌ను పోలీసులు విపరీతంగా కొట్టడంతోనే మృతిచెందినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ కేసు సంచలనం సృష్టించగా.. సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఎం.ఎ.సయ్యద్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై ట్రయల్ కోర్టు విచారణ చేపట్టింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 197 కింద రక్షణ కల్పించాలన్న పోలీసుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీనిపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ విధుల్లో భాగంగానే విచారణ చేశారని, ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా విచారణ జరపలేరని పోలీసులు తరఫు న్యాయవాది వాదించారు. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే తాజాగా హైకోర్టు సమర్థించింది. పోలీసుల రివిజన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. మైనింగ్ గొడవల్లో స్థానిక నేత సజీవ దహనం

హిమాచల్ ప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం.. బొలెరో లోయలో పడి దారుణం..

Updated Date - Jun 18 , 2026 | 05:41 PM