Share News

జెన్‌ జీ పేరుతో బెదిరింపులా? వైరల్‌ వీడియోపై వీకే సింగ్‌ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:31 PM

లద్దాఖ్‌లోని మినామార్గ్‌ చెక్‌పోస్టు వద్ద ఓ పర్యాటకురాలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ స్పందిస్తూ, సైనికులపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

జెన్‌ జీ పేరుతో బెదిరింపులా? వైరల్‌ వీడియోపై వీకే సింగ్‌ కీలక వ్యాఖ్యలు
VK Singh On Ladakh Tourist Viral Video

ఇంటర్నెట్ డెస్క్: లద్దాఖ్‌లోని మినామార్గ్‌ చెక్‌పోస్టు వద్ద ఓ పర్యాటకురాలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వాహనాలను చాలాసేపు నిలిపివేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని ప్రశ్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. తాము జెన్‌ జీ తరానికి చెందినవారమని పేర్కొంటూ, ఇలాంటి పరిస్థితులను అంగీకరించబోమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


వాస్తవాలు తెలుసుకోవాలి: వీకే సింగ్‌

ఈ ఘటనపై మాజీ ఆర్మీ చీఫ్‌, కేంద్ర మాజీ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ స్పందించారు. సాయుధ బలగాలు దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సైనికులపై విమర్శలు చేసే ముందు అక్కడి పరిస్థితులు, వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సైనికులపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు ప్రజలు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.


అసలు మినామార్గ్‌ చెక్‌పోస్టు వద్ద ఏం జరిగింది?

లద్దాఖ్‌లోని మినామార్గ్‌ ప్రాంతంలో వాహనాలను గంటల పాటు నిలిపివేయడంతో పర్యాటకురాలు భద్రతా సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. కుటుంబాలతో, చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్న వాహనాలను ఎందుకు ఎక్కువసేపు ఆపారని ఆమె నిలదీసినట్లు వైరల్‌ వీడియోలో కనిపిస్తోంది.

ఆ సమయంలో భద్రతా కాన్వాయ్‌ అక్కడికి చేరుకోవడంతో రహదారి పక్కకు వెళ్లాలని సిబ్బంది ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రహదారిని కేవలం వీఐపీ కాన్వాయ్‌ కోసం మాత్రమే నిలిపివేశారని ఆమె ఆరోపించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు, అధికారిక వివరణ ఇంకా స్పష్టంగా వెలువడాల్సి ఉంది. లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం, రహదారి పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా వాహనాల రాకపోకలను నియంత్రించడం సాధారణమేనని అక్కడి అధికారులు పేర్కొన్నారు.


‘మేము జెన్‌ జీ’ వ్యాఖ్యలపై ఒమర్‌ అబ్దుల్లా సెటైర్‌

వైరల్ వీడియోపై జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కూడా స్పందించారు. గతంలో కొందరు రాజకీయ నాయకుల పిల్లలు తమ తండ్రి పేరు చెప్పి అధికారులను బెదిరించేవారని గుర్తుచేశారు. ఇప్పుడు ‘మేము జెన్‌ జీ’ అంటూ చెప్పడం మరో రకమైన బెదిరింపుగా మారిందంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


Also Read:

'వందేమాతరం'పై కాంగ్రెస్ నిర్ణయం దేశాన్ని అవమానించడమే: అమిత్‌షా

వందేమాతర వివాదం.. కాంగ్రెస్‌పై బీజేపీ నేత తీవ్ర విమర్శలు..

Updated Date - Aug 20 , 2026 | 04:11 PM