పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా రాహుల్ విదేశీ పర్యటనలు.. కిరణ్ రిజిజు
ABN , Publish Date - May 15 , 2026 | 02:49 PM
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారనాడు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ నిబంధనలను రాహుల్ పాటించాలని, నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనకు ముందు లోక్సభ లేదా రాజ్యసభ సెక్రటేరియట్కు ఆ వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
న్యూఢిల్లీ: లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) శుక్రవారనాడు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ నిబంధనలను రాహుల్ పాటించాలని, నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనలకు ముందు లోక్సభ లేదా రాజ్యసభ సెక్రటేరియట్కు ఆ వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
రాహుల్ విదేశీ పర్యటనలు చేసే హక్కును తాము నిరోధించడం లేదని, అయితే సమాచారం మాత్రం ఇవ్వాలని కోరుతున్నామని కిరణ్ రిజిజు చెప్పారు. 'ప్రతి ఎంపీ విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చు. కానీ మూడు వారాల ముందు సమాచారం ఇవ్వాలి. రాహుల్ గాంధీని ఆహ్వానించే ఏజెన్సీలు, సంస్థలు ఆ ఖర్చులు పెట్టుకోవచ్చు. అయితే అది విదేశీ కంట్రిబ్యూషన్ (నియంత్రణ) చట్టం కిందకు వస్తుంది. అందువల్ల ఆ సమాచారాన్ని హోం శాఖకు షేర్ చేయాల్సి ఉంటుంది' అని అన్నారు.
రాహుల్ గాంధీ 2004లో తొలిసారి ఎంపీ అయినప్పటి నుంచి 54 సార్లు విదేశీ పర్యటనలు చేసినట్టు రిజిజు చెప్పారు. '54 పర్యటనలకే అది పరిమితం కాదు. ఎన్నిరోజులు ఆయన విదేశాల్లో ఉన్నారు, ఖర్చుల సంగతేమిటి? ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి. ఆ దృష్ట్యా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నిబంధనలు పాటించి తగిన సమాచారాన్ని అధికారులకు ఇవ్వాలి. మూడు వారాలకు ముందే ప్రతిపాదిత పర్యటనను లోక్సభ స్పీకర్కు చెప్పాలి. విదేశీ అతిథ్యాన్ని ఆయన అంగీకరించి ఉంటే ఆ విషయాన్ని ఎఫ్సీఆర్ఏ కింద హోం శాఖకు తెలియజేయాల్సి ఉటుంది' అని వివరించారు. చట్టం అనేది అందరికీ సమానమేనని, కేవలం లోక్సభ విపక్షనేతను ఉద్దేశించి తాను ఈ విజ్ఞప్తి చేయడం లేదని చెప్పారు. దేశంలో అమల్లో ఉన్న చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
నీట్ పరీక్షపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు