కేరళ ఆలయ ఉత్సవాల్లో విషాదం.. ఏనుగుల దాడిలో ఇద్దరి మృతి
ABN , Publish Date - May 02 , 2026 | 04:00 PM
కేరళలోని సంప్రదాయ ఆలయ ఉత్సవాలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయాయి. రాష్ట్రంలో వేసవి ఉత్సవాల సందడి నెలకొన్న వేళ ఈ రోజు(శనివారం) చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర ఆందోళనల్ని కలిగిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కేరళలోని సంప్రదాయ ఆలయ ఉత్సవాలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయాయి. రాష్ట్రంలో వేసవి ఉత్సవాల సందడి నెలకొన్న వేళ ఈ రోజు(శనివారం) చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఏనుగుల దాడిలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎర్నాకుళం, త్రిస్సూర్ జిల్లాల్లో జరిగిన ఈ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలు రాష్ట్రంలో పండుగలు, ఉత్సవాల సమయంలో బంధించి ఉంచే ఏనుగుల భద్రత, వాటి సంక్షేమంపై మరోసారి తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
ఎర్నాకుళం జిల్లాలోని కిడంగూర్ శ్రీ మహావిష్ణు ఆలయం వద్ద ఓ ఏనుగు బీభత్సవం సృష్టించింది. ఆకస్మికంగా ఆగ్రహించిన ఏనుగు.. ఆలయ ప్రాంగణానికి రవాణా చేసిన కొల్లాంకు చెందిన లారీ డ్రైవర్ విష్ణుపై దాడి చేసింది. అక్కడే ఆపిఉంచిన ఇన్నోవా కారును పలుమార్లు ఈడ్చి కొట్టడం సహా సమీపంలోని ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసింది. దీంతో భక్తులు, కార్మికులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అటవీ శాఖకు చెందిన ప్రత్యేక ఏనుగుల బృందాన్ని రంగంలోకి దింపి 4 గంటల సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఆ గజరాజుకు మత్తుమందిచ్చి అదుపులోకి తీసుకున్నారు అటవీ అధికారులు.
ఇదిలా ఉండగా.. త్రిస్సూర్ జిల్లాలోని ప్రసిద్ధ కూడల్ మాణిక్యం ఆలయంలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఇక్కడ ఓ ఏనుగు సృష్టించిన బీభత్సంలో.. మావటి శ్రీకుట్టన్(25) తీవ్ర గాయాలపాలై ఇరింజలకుడ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో మావటి అమల్(28) కూడా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేరళలో కొన్నేళ్లుగా కేరళలో ఆలయ ఉత్సవాలు, ఊరేగింపులలో ఏనుగులను ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఘటనలపై స్థానిక అధికారులు, అటవీ సిబ్బంది విచారణ చేపడుతున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్
స్వచ్ఛ రథాలకు నేచురల్ స్టార్ నాని సహాయం.. స్పందించిన డిప్యూటీ సీఎంవో..