భార్యను చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించే కుట్ర
ABN , Publish Date - Jul 29 , 2026 | 06:41 AM
కట్టుకున్న భార్యను అనుమానించాడు. కర్రతో దాడి చేసి, ఆమెను ఉరితీశాడు. ఉరితాడుకు వేలాడుతూ.. విలవిలలాడుతుండగా అత్తమామలకు వీడియోకాల్ చేసి చూపించాడు.
ఉరికి వేలాడదీసి తల్లిదండ్రులకు వీడియోకాల్
కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో ఓ వ్యక్తి దారుణం.. నిందితుడి అరెస్టు
బెంగళూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కట్టుకున్న భార్యను అనుమానించాడు. కర్రతో దాడి చేసి, ఆమెను ఉరితీశాడు. ఉరితాడుకు వేలాడుతూ.. విలవిలలాడుతుండగా అత్తమామలకు వీడియోకాల్ చేసి చూపించాడు. తన భార్య ఆత్మహత్య చేసుకుందని నమ్మించే కుట్ర చేశాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని బాగల్కోటె జిల్లా గలగలి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రవీణ్కు భాగ్యశ్రీ(24)తో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది.
వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగ్యశ్రీ భర్తను విడిచిపెట్టి కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లింది. అత్తారింటికి వెళ్లిన ప్రవీణ్, ఇకపై గొడవలు లేకుండా కలిసి ఉందామని భార్యను కాపురానికి తీసుకువచ్చాడు. ఇద్దరి మధ్య సోమవారం మరోసారి వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ప్రవీణ్ ఆమెపై దాడి చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.