అసెంబ్లీలో ప్రసంగించేందుకు నిరాకరించిన కర్ణాటక గవర్నర్
ABN , Publish Date - Jan 21 , 2026 | 09:54 PM
కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రారంభోపన్యాసంతో ఉభయ సభలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఇందుకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రారంభోపన్యాసంతో సభలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఇందుకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రసంగానికి గవర్నర్ ఎందుకు నిరాకరించారనేది వెంటనే తెలియలేదు. అయితే ప్రభుత్వం తయారుచేసిన ప్రసంగ పాఠంలో కేంద్రాన్ని ఉద్దేశించి కొన్ని అంశాలు ఉండటమే ఇందుకు కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు, గవర్నర్ నిర్ణయంతో ఆయనను తాము స్వయంగా కలుస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ నాయకత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గవర్నర్ను కలుసుకునేందుకు లోక్భవన్కు వెళ్లింది. కాగా, పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులోనూ ఇదే తరహా వివాదాలు ఇటీవల చోటుచేసుకున్నాయి.
షెడ్యూల్ ప్రకారం, ఈనెల 22న కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై 31వ తేదీతో ముగియనున్నాయి. ఈసారి అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ-జేడీ(ఎస్) కూటమి మధ్య సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రద్దు చేస్తూ 'వీబీ-జి రామ్ జి' చట్టం తీసుకురావడాన్ని కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఒక తీర్మానాన్ని కూడా అధికార పార్టీ సభలో ప్రవేశపెట్టనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
26-26 ఉగ్ర కుట్రకు ప్లాన్.. నిఘా వర్గాలు అప్రమత్తం
ఉద్ధవ్కు షాక్.. షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన ఎంఎన్ఎస్
Read Latest National News