Share News

భారత జీడీపీ వృద్ధి రేటుతో ప్రపంచ దేశాలకు కొత్త ఆశలు: ప్రధాని మోదీ

ABN , Publish Date - Sep 08 , 2026 | 08:48 PM

భారత జీడీపీ వృద్ధి రేటు ప్రపంచ దేశాలకు నూతన ఆశలను నింపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన 'గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్' సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు.

భారత జీడీపీ వృద్ధి రేటుతో ప్రపంచ దేశాలకు కొత్త ఆశలు: ప్రధాని మోదీ
India’s 7.8% GDP Growth Gives World Fresh Hope: PM Modi

ముంబై, సెప్టెంబర్ 8: అంతర్జాతీయంగా యుద్ధ భయాలు, వస్తు సరఫరా అవాంతరాలు, ముడిచమురు సంక్షోభం వెంటాడుతున్న తరుణంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన ప్రతిభను కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశం 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటును (GDP Growth) నమోదు చేయడం, ప్రపంచ దేశాలకు నూతన ఆశలను నింపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన 'గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్' (Global Fintech Fest) మూడో విడత సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.


ప్రధాని ప్రసంగంలోని ప్రధానాంశాలు

సవాళ్లను అధిగమించిన భారత ఆర్థిక వ్యవస్థ: గడిచిన ఏప్రిల్-జూన్ త్రైమాసికం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగానికి అత్యంత సవాలుగా మారిందని ప్రధాని అన్నారు. ఇంధనం, నిత్యవసర వస్తువుల సరఫరా వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ 7.8శాతం వృద్ధిని సాధించడం మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు.


జపాన్ ఏజెన్సీ నుంచి రికార్డు రేటింగ్: దాదాపు మూడు దశాబ్దాల (30 ఏళ్లు) తర్వాత జపాన్‌కు చెందిన ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ భారత్‌కు ‘A Category’ సావరేన్ రేటింగ్‌ను కేటాయించిందని ప్రధాని వెల్లడించారు. భారత స్థూల ఆర్థిక స్థిరత్వం, వేగవంతమైన వృద్ధి, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ప్రపంచానికి ఉన్న నమ్మకానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు.

ఆగని సంస్కరణల రథం: రాబోయే రోజుల్లో దేశీయ సంస్కరణలు మరిన్ని వేగవంతం అవుతాయని మోదీ స్పష్టం చేశారు. 'ఇండియాస్ రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్ ఇకపై మరింత వేగంగా దూసుకెళ్తుంది' అని ప్రధాని పునరుద్ఘాటించారు.


ఫిన్‌టెక్ చరిత్రలో యూపీఐ ఒక విప్లవం

యూపీఐ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ప్రధాని గుర్తుచేసుకుంటూ, భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణం అద్భుతంగా సాగుతోందన్నారు. సింగపూర్‌తో భారత యూపీఐ అనుసంధానమైన రీతిలోనే, రాబోయే రోజుల్లో ఇతర విదేశీ చెల్లింపుల వ్యవస్థలతో కూడా యూపీఐని అనుసంధానించడమే తదుపరి లక్ష్యమని తెలిపారు.


స్మార్ట్‌ఫోన్‌లో బ్యాంకింగ్: ఒకప్పుడు ప్రతీ ఒక్కరి చేతివేళ్లపైనే బ్యాంకింగ్ సేవలందుతాయని తాను చెప్పినప్పుడు చాలామంది మేధావులు నమ్మలేదని, కానీ నేడు యూపీఐ దానిని నిజం చేసి చూపించిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 08 , 2026 | 09:17 PM