వెనెజువెలాలో మరణించిన భారత నావికుడి అవయవాలు మాయం.. దర్యాప్తు కోరుతున్న కుటుంబం..
ABN , Publish Date - Jul 01 , 2026 | 02:09 PM
వెనెజువెలాలో ఈ ఏడాది మే నెలలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ కేసు సంచలనంగా మారింది.
వెనెజువెలాలో ఈ ఏడాది మే నెలలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ (Rakesh Chauhan) కేసు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల రాకేష్ చౌహాన్ మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చిన తర్వాత నిర్వహించిన పోస్టుమార్టంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాకేష్ చౌహాన్ మృతదేహంలో మెదడు, గుండె, రెండు ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ప్లీహం, క్లోమం,పేగులు సహా దాదాపు అన్ని ప్రధాన అంతర్గత అవయవాలు లేనట్టు వెలుగులోకి వచ్చింది. మృతదేహానికి ముందే విస్తృతంగా కుట్లు వేసి ఉన్నాయని, మృతదేహాన్ని దాదాపు ఒక నెల పాటు డీప్ ఫ్రీజ్లో ఉంచారని, మరణానికి కారణాన్ని నిర్ధారించలేకపోయారని పోస్ట్మార్టం నివేదిక వెల్లడించింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు (Indian sailor death).
గతేడాది నవంబర్లో రాకేష్, ఎక్స్ఫినిటీ సంస్థ తరఫున మర్చంట్ నేవీ నౌక సిబ్బందిగా వెనెజువెలాకు వెళ్లారు. ఈ ఏడాది మేలో ఆయన మరణించినట్లు కుటుంబానికి కంపెనీ సమాచారం ఇచ్చింది. తొలుత నౌకపై పడిపోవడంతో గాయాలయ్యాయని, అనంతరం పరిస్థితి విషమించి మరణించారని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మృతదేహం దాదాపు నెల రోజుల తర్వాత భారత్కు చేరిందని వారు తెలిపారు.
మృతదేహం భారత్కు చేరుకున్న తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలతో మళ్లీ పోస్టుమార్టం నిర్వహించారు. మెడ నుంచి నడుము వరకు 22 కుట్లు, తల వెనుక భాగంలో మరో 21 కుట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యమైన అంతర్గత అవయవాలు లేకపోవడంతో మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడం సాధ్యం కాలేదని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది (Missing organs).
ఈ ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా (FSUI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం, వెనెజువెలాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకుని పూర్తి దర్యాప్తు చేపట్టాలని, కుటుంబానికి న్యాయం చేయాలని ఎఫ్ఎస్యూఐ డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
భారత్ క్లిష్టమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది.. చుట్టూ కఠినమైన దేశాలు: అమెరికా రాయబారి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..