54 వేల టన్నుల LPGతో గుజరాత్ పోర్ట్ చేరుకున్న శివాలిక్ నౌక
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:08 AM
ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో బయలుదేరిన భారీ ట్యాంకర్ 'శివాలిక్', సురక్షితంగా గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. గుజరాత్లోని అదానీ ముంద్రా పోర్టులో ఈ గ్యాస్ అన్-లోడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
ముంద్రా (గుజరాత్) ఫిబ్రవరి 16: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్కు ఊరటనిచ్చే వార్త అందింది. ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో బయలుదేరిన భారీ ట్యాంకర్ 'శివాలిక్', సురక్షితంగా గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్న సమయంలో ఈ నౌక రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
వ్యూహాత్మక విజయం
ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణల కారణంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి మూసివేత ముప్పు పొంచి ఉంది. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో, గల్ఫ్ దేశాల నుండి భారత్కు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోతుందేమోనన్న ఆందోళన నెలకొంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 'శివాలిక్' నౌక సురక్షితంగా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోవడం భారత ఇంధన భద్రతకు సానుకూల సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.
శివాలిక్ ఎల్పిజి ట్యాంకర్ ఖతార్లోని రాస్ లఫ్పాన్ నుండి వేల టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చింది. ఉద్రిక్తతల దృష్ట్యా భారత నావికాదళం గల్ఫ్ ప్రాంతంలో నిఘాను పెంచిన సంగతి తెలిసిందే. భారతీయ నౌకల ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రతాపరమైన భరోసా కల్పిస్తోంది. గుజరాత్లోని అదానీ ముంద్రా పోర్టులో ఈ గ్యాస్ అన్-లోడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది దేశీయ గ్యాస్ అవసరాలకు ఎంతో కీలకం.
హోర్ముజ్ జలసంధి ప్రాముఖ్యత
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో సుమారు 20 శాతం ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల ఈ మార్గం మూసుకుపోతే అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గంలో ప్రయాణాన్ని నిలిపివేయగా, భారత్ మాత్రం తన వ్యూహాత్మక సంబంధాల ద్వారా సరఫరాను కొనసాగిస్తోంది.
ఇవి కూడా చదవండి...
యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం
Read Latest Telangana News And Telugu News