జులైలో రూ.2లక్షల కోట్లు దాటిన GST కలెక్షన్లు
ABN , Publish Date - Aug 01 , 2026 | 04:09 PM
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సంకేతంగా జులై నెలలో జీఎస్టీ వసూళ్లు రెండు లక్షల కోట్ల రూపాయల మార్క్ను దాటాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 15.4 శాతం వృద్ధి నమోదవగా, తెలంగాణలో 19 శాతం పెరుగుదల కనిపించింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో జులై నెలకు సంబంధించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. గత ఏడాది జులైతో పోలిస్తే ఇది 15.4 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్క్ను దాటడం రెండోసారి. అంతకుముందు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.2.43 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.
దేశీయ వ్యాపార లావాదేవీల నుంచి వచ్చిన పన్ను ఆదాయం 10.1 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరుకుంది. అదే సమయంలో దిగుమతులపై లభించిన స్థూల పన్ను (Gross Tax) ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.66,511 కోట్లకు పెరిగింది.
జులై నెలలో కేంద్ర జీఎస్టీ (CGST) రూ.39,835 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (SGST) రూ.47,881 కోట్లు, సమీకృత జీఎస్టీ (IGST) రూ.1.23 లక్షల కోట్లు నమోదయ్యాయి.
ఇక, జులై నెలలో మొత్తం రూ.29,968 కోట్ల రీఫండ్లు జారీ చేయగా, వాటిని మినహాయించిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో రూ.5,819 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఇది గతేడాది జులైతో పోలిస్తే 19 శాతం పెరుగుదల. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో జులై నెలలో రూ.3,366 కోట్ల జీఎస్టీ వసూలైంది.
Also Read:
ఉగ్రకుట్ర భగ్నం.. జైషే నెట్వర్క్లోని కీలక పాత్రధారి అరెస్ట్
ట్విన్స్ను పెళ్లి చేసుకున్న ట్విన్స్.. పెళ్లి జరిపించిన పాస్టర్లు కూడా ట్విన్స్..