Share News

ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్‌.. హత్య కేసు నిందితుడి హతం..

ABN , Publish Date - May 31 , 2026 | 08:26 AM

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ ఇందిరాపురంలో ఎన్‌కౌంటర్ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్‌.. హత్య కేసు నిందితుడి హతం..

ఉత్తర్ ప్రదేశ్: ఘజియాబాద్ ఇందిరాపురంలో ఎన్‌కౌంటర్ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పక్కా సమాచారం ఆధారంగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు తన స్నేహితుడిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.


ఈ నెల 28న సూర్య చౌహాన్ (17) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఇందిరాపురం పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా.. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడైన అసద్ పరారీలో ఉన్నాడు. అతనిపై పోలీసులు రూ.50 వేల రివార్డ్ కూడా ప్రకటించారు. అయితే, ఇందిరాపురంలోని ఖోడా ప్రాంతానికి తన స్నేహితులను కలిసేందుకు అసద్ వెళ్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసు బృందాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టాయి. అసద్, తన స్నేహితుడు ద్విచక్రవాహనంపై రాగా.. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు.


అయితే, పోలీసు బృందంపై అసద్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులూ ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో అసద్‌కి తీవ్రగాయాలు కాగా.. ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. పోలీసులు వారిద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. అసద్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా నిందితుడు ఉపయోగించిన తుపాకీ, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోటార్ సైకిల్ నడిపే విషయంలో సూర్య, అసద్ మధ్య వివాదం చెలరేగిందని.. దీంతో సూర్యను నిందితుడు కత్తితో పొడిచి హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు సూర్య తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈద్ పండుగ పేరుతో తమ కుమారుడిని ఏడుగురు బయటకు తీసుకెళ్లి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. వారందరినీ ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బద్రీనాథా... ఈ ట్రాఫిక్‌ జామ్‌ ఏమిటయ్యా?

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. బాబాగా మారాలని జననాంగం నరుక్కున్నాడు..

Updated Date - May 31 , 2026 | 08:28 AM