Share News

రష్యా నుంచి భారత్‌కు చేరిన నాల్గవ సుదర్శన్ ఎస్-400 స్క్వాడ్రన్

ABN , Publish Date - Jun 03 , 2026 | 08:26 PM

రష్యా నుంచి ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం నాల్గవ స్క్వాడ్రన్ భారత్‌కు చేరుకుంది. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం కానుంది.

రష్యా నుంచి భారత్‌కు చేరిన నాల్గవ సుదర్శన్ ఎస్-400 స్క్వాడ్రన్
S-400 squadron arrives in India from Russia

న్యూఢిల్లీ: రష్యా నుంచి ఎస్-400 సుదర్శన్ (S-400 Sudarshan) ఎయిర్ డిఫెన్స్ సిస్టం నాల్గవ స్క్వాడ్రన్ భారత్‌కు చేరుకుంది. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం కానుంది. ఎస్-400 సుదర్శన్ సుదీర్ఘ శ్రేణి ఎయిర్‌డిఫెన్స్ సిస్టం రష్యా నుంచి నౌకలో భారత్‌కు వచ్చినట్టు రక్షణ శాఖ వర్గాలు బుధవారంనాడు తెలిపాయి. త్వరలోనే ఆపరేషన్ ఏరియాలో దీనిని మోహరించనున్నట్టు వెల్లడించాయి.


భారత్ 2018లో రూ.35,000 కోట్లతో 5 స్క్వాడ్రన్ల కొనుగోలుకు రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఇందులో 3 స్క్వాడ్రన్లను రెండేళ్ల క్రితమే భారత్ అందుకుంది. నాల్గవది తాజాగా భారత్ చేరుకుంది. మరి కొద్ది నెలల్లోనే 5వ స్క్వాడ్రన్ కూడా భారత్‌కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.


ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ జరిపిన డ్రోన్, క్షిపణులను ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత సమర్ధవంతంగా కూల్చివేసింది. ఏకకాలంలో 300 లక్ష్యాలను ట్రాక్ చేసి, 40 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని శత్రు క్షిపణులను, డ్రోన్లు, స్టెల్త్ ఫైటర్ జెట్‌లను ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టం సమర్ధవంతంగా తిప్పికొట్టగలదు. కాగా, భారత్ సైతం రష్యా సిస్టమ్ తరహాలోనే శత్రువిమానాలను కుప్పకూల్చే డిఫెన్స్ సిస్టమ్‌ 'కుషా'ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తోంది. దీని అభివృద్ధి, ఉత్పత్తిలో భాగస్వామిగా ఇండియన్ డిఫెన్స్ మేజర్ సోలార్ ఇండస్ట్రీలు భాగస్వామిగా వ్యవహరిస్తున్నాయి. రష్యా నుంచి ప్రస్తుతం అందుకున్న ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్‌ను పశ్చిమబెంగాల్‌లో మోహరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

Updated Date - Jun 03 , 2026 | 08:37 PM