Share News

ఈ నెలాఖరు నుంచే యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:06 PM

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 'EPFO 3.0' కింద PF చందాదారులు ఇకపై తమ పీఎఫ్ డబ్బును నేరుగా యూపీఐ యాప్‌లు, ఏటీఎంల ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ నెలాఖరు నుంచే యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం
EPFO 3.0: PF Withdrawal via UPI and ATM Likely by June-End

న్యూఢిల్లీ, జూన్ 18: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన చందాదారులకు త్వరలోనే ఒక భారీ ఉపశమనాన్ని కలిగించనుంది. సరికొత్త డిజిటల్ ప్లాట్ ఫామ్ 'EPFO 3.0' కింద పీఎఫ్ (PF) చందాదారులు ఇకపై తమ పీఎఫ్ డబ్బును నేరుగా యూపీఐ (UPI) యాప్‌లు, ఈపీఎఫ్ఓ అనుసంధానిత ఏటీఎంల ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సరికొత్త సదుపాయం ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గతంలోనే సూచించిన సంగతి తెలిసిందే.


75 శాతం వరకు తక్షణ విత్‌డ్రా అవకాశం

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ సరికొత్త సిస్టమ్ ట్రయల్స్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. దీంతో పీఎఫ్ ఖాతాదారులు తమ మొత్తం నిల్వలో గరిష్ఠంగా 75 శాతం వరకు నగదును యూపీఐ లేదా ఏటీఎంల ద్వారా తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం కనీసం 25 శాతం నిధిని ఖాతాలోనే ఉంచాల్సి ఉంటుంది.


ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)

ఈ సరికొత్త విధానం ఫలితంగా పీఎఫ్ ఖాతాదారులు తమ గుర్తింపును నిరూపించుకోవడానికి వివిధ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. దానికి బదులుగా 'ఉమాంగ్' (UMANG) యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్‌గా గుర్తింపును ధ్రువీకరించుకోవచ్చు. అలాగే యూఏఎన్ (UAN) యాక్టివేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

ఈ సరికొత్త మార్పుల వల్ల పీఎఫ్ విత్‌డ్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. పేపర్‌వర్క్, కాలయాపన తగ్గి పారదర్శకత పెరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సహాయం పొందడానికి ఉద్యోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.


ఇవీ చదవండి:

డీఎంకేకు మరో షాక్.! టీవీకే వైపు ఎండీఎంకే.?

బీబీ ఒకసారి ఆలోచించండి.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్

Updated Date - Jun 18 , 2026 | 03:28 PM