ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్కు రూ.495కోట్లు
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:15 AM
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2023-24లో బీఆర్ఎ్సకు రూ.495.52కోట్లు అందాయి. దేశంలోనే అత్యధికంగా తృణమూల్ కాంగ్రె్సకు రూ.612 కోట్లు అందగా, ఆ తర్వాత రెండో స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది...
612 కోట్లతో తృణమూల్ తొలి స్థానం
రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్
174కోట్లతో టీడీపీకి నాలుగో స్థానం
రూ.121 కోట్లతో వైసీపీకి ఐదో స్థానం
2023-24లో బాండ్ల రూపంలో 40 పార్టీలకు వచ్చింది రూ.1820కోట్లు
2023-24లో వచ్చిన విరాళాలు 347కోట్లే
బాండ్ల రద్దు తర్వాత 1,051కోట్లకు చేరిక
నివేదిక విడుదల చేసిన ఏడీఆర్
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2023-24లో బీఆర్ఎ్సకు రూ.495.52కోట్లు అందాయి. దేశంలోనే అత్యధికంగా తృణమూల్ కాంగ్రె్సకు రూ.612 కోట్లు అందగా, ఆ తర్వాత రెండో స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. ఆ తర్వాత బిజూ జనతాదళ్ (రూ.245 కోట్లు), టీడీపీ (రూ.174 కోట్లు), వైసీపీ (రూ.121 కోట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. 2023-24, 2024-25 మధ్య కాలంలో రూ.20వేలకుపైగా అందిన విరాళాలు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన నిధులపై 40 ప్రాంతీయ రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. వాస్తవానికి ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024 ఫిబ్రవరి 15న నాటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతకన్నా ముందు (2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరి వరకు) బాండ్ల ద్వారా ఆయా పార్టీలకు అందిన నిధుల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బ్లాండ్ల ద్వారా 2023-24లో 40 రాజకీయ పార్టీలకు కలిపి రూ.1820.02 కోట్లు అందినట్లు పేర్కొంది. అదే సమయంలో రూ.20వేల కన్నా ఎక్కువ మొత్తంలో వచ్చిన విరాళాలు కేవలం రూ.347.69కోట్లు మాత్రమే కావడం గమనార్హం. బాండ్ల రద్దు తర్వాత 2024-25లో రూ.20వేల కన్నా ఎక్కువ మొత్తంలో వచ్చిన విరాళాలు ఏకంగా రూ.1,051కోట్లకు చేరుకున్నాయి. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో రాజకీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాల్లో 60శాతం కంటే ఎక్కువ వాటా డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ, టీడీపీదే కావడం గమనార్హం. 2023-24లో అత్యధికంగా రూ.100.18 కోట్ల విరాళాలను ప్రకటించి.. టీడీపీ అగ్రస్థానంలో నిలిచింది. కానీ, 2024-25కి వచ్చేసరికి ఈ మొత్తం రూ.83 కోట్లకు పడిపోయింది.
మరోవైపు, 2023-24లో కేవలం 4 విరాళాల ద్వారానే ఏకంగా రూ.62.50 కోట్లు వచ్చినట్లు ప్రకటించిన వైసీపీ.. 2024-25లో 37 విరాళాల ద్వారా రూ.140 కోట్లను ఆర్జించినట్లు పేర్కొంది. జనసేన పార్టీకి 2023-24లో విరాళాల ద్వారా రూ.36 కోట్లు రాగా, 2024-25లో రూ.25 కోట్లు వచ్చాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. 2024-25లో రూ.365.78 కోట్ల విరాళాలతో డీఎంకే మొదటిస్థానంలో, రూ.184.96 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్ రెండో స్థానంలో, రూ.140 కోట్లతో వైసీపీ మూడో స్థానంలో, రూ.83 కోట్లతో టీడీపీ నాలుగో స్థానంలో, రూ.66 కోట్లతో అన్నాడీఎంకే ఐదో స్థానంలో నిలిచాయి. కాగా, 2023-24లో 8 విరాళాల ద్వారా రూ.85 కోట్లను ఆర్జించిన బీఆర్ఎస్.. 2024-25 నాటికి కేవలం 4 విరాళాల ద్వారా కేవలం రూ.15 కోట్లను మాత్రమే స్వీకరించింది. ఆ పార్టీ విరాళాల మొత్తంలో ఏకంగా 82 శాతానికి పైగా క్షీణత నమోదైనట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది.
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News