ఇండీ కూటమికి డీఎంకే గుడ్బై! లోక్సభలో వాళ్ల పక్కన కూర్చోలేమంటూ..
ABN , Publish Date - May 08 , 2026 | 06:24 PM
ఇండీ కూటమికి డీఎంకే గుడ్బై చెప్పేసింది. లోక్సభలో తమకు కాంగ్రెస్ పక్కన కాకుండా మరో చోట సీట్లు కేటాయించాలని ఎంపీ కనిమొళి లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ సారథ్యంలోని ఇండీ కూటమికి డీఎంకే గుడ్బై చెప్పేసింది. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ సారథ్యంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు పలకడంపై డీఎంకే నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ కనిమొళి లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్తో తమ భాగస్వామ్యం ముగిసిందని అన్నారు. కాబట్టి లోక్సభలో ఇకపై వారి పక్కన కూర్చోవడం సబబు కాదని అన్నారు. డీఎంకే పార్లమెంటరీ పార్టీకి లోక్సభలో ప్రత్యేకంగా ఇతర సీట్లు కేటాయించాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు.
22 మంది లోక్సభ ఎంపీలు ఉన్న డీఎంకే ఇప్పటివరకూ ఇండీ కూటమిలో నాలుగో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్, డీఎంకేల మధ్య అప్పుడప్పుడూ పొరపొచ్చాలు వచ్చినప్పటికీ రెండూ కొన్ని దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో కలిసి ముందడుగు వేస్తున్నాయి. అయితే, తమిళనాడులో కాంగ్రెస్ తాజా నిర్ణయంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన డీఎంకే నేతలు కొందరు హస్తం పార్టీ వెన్నుపోటు పోడిచిందని కూడా ఆరోపించారు. ఇటీవల ఇండీ కూటమిలోని సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్పై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. కష్ట సమయాల్లో కూడా తాము తమ వారిని విడిచిపెట్టబోమంటూ ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్.. స్టాలిన్, మమతా బెనర్జీలతో తాను దిగిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
సోనార్ బంగ్లా కలల సాకారం.. సువేందును శాసనసభాపక్ష నేతగా ప్రకటించిన అమిత్షా
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం