Share News

ప్రజలు ఎన్నుకొన్న టీవీకేని అడ్డుకోవడం నేరం: కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్

ABN , Publish Date - May 07 , 2026 | 04:18 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీవీకే పార్టీకి పట్టం కట్టారని, అయినాకాని, విజయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, అదే న్యాయమని చెప్పారు.

ప్రజలు ఎన్నుకొన్న టీవీకేని అడ్డుకోవడం నేరం:  కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్
Congress MP Manickam Tagore Backs Vijay’s TVK

చెన్నై, మే 7: తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న 'తమిళగ వెట్రి కజగం' (TVK) అధినేత విజయ్‌కు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పూర్తి మద్దతు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోసం ఎంతో ఆశగా ఓటు వేసినప్పటికీ, నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ANI వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ, తమిళనాడులో వచ్చిన తీర్పు విజయ్ నాయకత్వానికి ప్రజల మద్దతును స్పష్టంగా ప్రతిబింబిస్తోందని ఠాగూర్ పేర్కొన్నారు.

గవర్నర్ వెంటనే TVKని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని, సభలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. 'తమిళనాడులో ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని మనందరికీ తెలుసు.. ప్రజలు ఒక కొత్త నాయకుడి కోసం ఓటు వేశారు. ఆ పార్టీ నుంచి 108 మంది సభ్యులు ఎన్నికయ్యారు'. అని ఠాగూర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతుతో TVK బలం 113కు చేరిందని, 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ మార్కుకు కేవలం కొన్ని సీట్ల దూరంలోనే ఉందని ఆయన గుర్తుచేశారు.

'గవర్నర్ బీజేపీకి చెందిన వ్యక్తి.. ఆయన గతంలో బీజేపీలో పనిచేశారు. ఆయనకు బీజేపీ మనస్తత్వం ఉందని మనందరికీ తెలుసు. విజయ్‌ను ముఖ్యమంత్రిని చేయకూడదన్నదే 'ఢిల్లీ' (కేంద్ర నాయకత్వం) ఆలోచన'. అని ఆయన ఆరోపించారు. గవర్నర్‌పై బీజేపీ నాయకత్వం నుంచి ఒత్తిడి ఉందని ఠాగూర్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

తమిళనాడులో బీజేపీకి కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు.. ఒక్క ఎమ్మెల్యేతోనే బీజేపీ రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. మార్పు కోసం ఆశగా తమిళ ప్రజలు ఓటు వేసిన ఒక ప్రభుత్వాన్ని అడ్డుకోవడం నేరమని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. రాజ్యాంగ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య నిబంధనలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా విజయ్‌ను సభలో బలాన్ని నిరూపించుకునే (floor test) అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ సూచించారు. 'విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి త్వరగా ఆహ్వానించాలని, సభలో బలాన్ని నిరూపించుకోవడానికి అనుమతించాలని భావిస్తున్నా.. అదే న్యాయం.' అని ఠాగూర్ అన్నారు.


ప్రచార సమయంలో విజయ్ పదేపదే ఎదుర్కొన్న రాజకీయ 'అడ్డంకులు' చివరికి ఆయనకు అనుకూలంగా పనిచేశాయని ఠాగూర్ అన్నారు. 'విజయ్ తమిళనాడుకు ఆశాకిరణం. మీరు ఎవరినైనా ఆపినప్పుడు, ఎవరికైనా అడ్డంకులు సృష్టించినప్పుడు, ప్రజలు మీ పట్ల సానుభూతి చూపడం ఖాయం.' అని ఆయన చెప్పుకొచ్చారు. టీవీకేకు మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించుకున్న తర్వాత కాంగ్రెస్ 'వెన్నుపోటు పొడిచిందని' ఆరోపించిన డీఎంకేలోని కొన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ ఎంపీ విమర్శించారు.

'మాకు డీఎంకేతో నమ్మకమైన భాగస్వామ్యం ఉంది. డీఎంకే అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్‌తో నిలబడింది. కాంగ్రెస్‌ను వెన్నుపోటు పొడిచే పార్టీ అని పిలవడం ఆమోదయోగ్యం కాదు.' అని ఠాగూర్ అన్నారు. అయితే, తమిళనాడులో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో భాగంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్, డీఎంకే కలిసి పనిచేయడం కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు. 'పార్లమెంటులో, అన్ని లౌకిక పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా కలిసి ఉన్నాయి. మేము డీఎంకే లౌకికవాద విశ్వసనీయతను గౌరవిస్తాం, వారు అలానే ఉండాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. తామంతా కలిసి ఢిల్లీలో బీజేపీతో పోరాటం కొనసాగిస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2026 | 04:55 PM