Share News

చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..

ABN , Publish Date - May 20 , 2026 | 02:56 PM

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణకు దారితీసింది. విక్రమ్ ల్యాండర్ చేసిన చిన్న 'హాప్ ఎక్స్‌పెరిమెంట్' చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంత ఉపరితలం గురించి కొత్త వివరాలను బయటపెట్టింది.

చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..
Chandrayaan-3 latest discovery

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణకు దారితీసింది. విక్రమ్ ల్యాండర్ చేసిన చిన్న 'హాప్ ఎక్స్‌పెరిమెంట్' చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంత ఉపరితలం గురించి కొత్త వివరాలను బయటపెట్టింది. మిగిలిపోయిన ఇంధనాన్ని ఉపయోగించుకోవాలనే అనూహ్య నిర్ణయంతో ఈ ప్రయోగం చేపట్టారు. చంద్రుడిపై శివశక్తి పాయింట్ వద్ద ఉన్న నేల గతంలో భావించిన దానికంటే చాలా వైవిధ్యమైనదని, సంక్లిష్టమైనదని వెల్లడించే ఒక మైలురాయిగా ఈ ప్రయోగం నిలిచింది (Chandrayaan-3 latest discovery).


ఈ ప్రయోగంలో ల్యాండర్ సుమారు 40 నుంచి 50 సెంటీమీటర్లు పైకి ఎగిరి, కొద్దిదూరం పక్కకు వెళ్లి మళ్లీ సాఫ్ట్‌గా ల్యాండ్ అయింది. ఈ ప్రయోగం వల్ల చంద్రుడి ఉపరితలంపై ఉన్న పై పొర తొలగిపోయి, లోపలి మట్టిని చంద్ర సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ChaSTE) పరికరం పరిశీలించే అవకాశం లభించింది. దీంతో చంద్రుడి మట్టి ఒకేలా కాకుండా పలు పొరలుగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పైభాగం పొర చాలా మెత్తగా ఉండగా, కింద భాగం మరింత ఘనంగా ఉందని అధ్యయనం తెలిపింది (Vikram lander hop experiment).


ఈ సమాచారం భవిష్యత్ చంద్ర మిషన్లకు చాలా కీలకంగా మారనుంది (ISRO Moon mission). ముఖ్యంగా నాసా ఆర్టెమిస్ మిషన్ ద్వారా చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలనే ప్రణాళికలకు ఈ డేటా ఉపయోగపడనుందని నిపుణులు చెబుతున్నారు. 2023 జులై 14న ప్రయోగించిన చంద్రయాన్ 3, చంద్రుని దక్షిణ ధృవం ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయి ప్రపంచాన్ని అబ్బురపరిచింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్ట మొదటి దేశంగా భారత్ నిలిచింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం

Updated Date - May 20 , 2026 | 06:45 PM