TVK Vijay: విజయ్ ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన సీబీఐ
ABN , Publish Date - Jan 10 , 2026 | 03:49 PM
కరూర్ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే టీవీకే ఆఫీస్ బేరర్లను న్యూఢిల్లీలోని సీబీఐ హెడ్కార్వర్టర్లో అధికారులు ప్రశ్నించారు. జనవరి 12న తమ ముందు హాజరుకావాలని విజయ్కు సీబీఐ సమన్లు పంపింది.
న్యూఢిల్లీ: తమిళనాడులోని కరూర్లో తొక్కిసలాట ఘటనకు బాధ్యులను గుర్తించేందుకు చేపట్టిన దర్యాప్తును సీబీఐ (CBI) వేగవంతం చేసింది. నటుడు, రాజకీయనేత, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ (Vijay) ప్రచార వాహనాన్ని సీబీఐ సీజ్ చేసింది. ప్రచార వాహనం డ్రైవర్ సైతం సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 27న వేలుసామిపురంలో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
ఈ ఘటనపై ఇప్పటికే టీవీకే ఆఫీస్ బేరర్లను న్యూఢిల్లీలోని సీబీఐ హెడ్కార్వర్టర్లో అధికారులు ప్రశ్నించారు. జనవరి 12న తమ ముందు హాజరుకావాలని విజయ్కు సైతం సమన్లు పంపారు.
కాగా, కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలను విజయ్ అక్టోబర్ 27న మహాబలిపురంలోని ఒక రిసార్ట్లో కలుసుకున్నారు. కరూర్ కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల చొప్పున సాయం అందిస్తామని, గాయపడిన వారికి రూ.2 లక్షలు సాయం చేస్తామని టీవీకే పలుమార్లు ప్రకటించింది. చెప్పిన విధంగానే 39 కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున మొత్తం 7.8 కోట్లు పంపించినట్టు టీవీకే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.
మరోవైపు, తొక్కిసలాట ఘటన అనంతరం సెప్టెంబర్ 28న శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ డేవిడ్సన్ మాట్లాడుతూ, సమాచారం అందిన వెంటనే సుమారు 10 అంబులెన్స్లను అమరావతి ఆసుపత్రి నుంచి వెంటనే రంగంలోకి దింపామన్నారు. ర్యాలీకి 10,000 మంది వస్తారని అంచనా వేసినప్పటికీ సుమారు మూడు రెట్లుగా 27,000 మంది వచ్చారని, ఏడు గంటలు ఆలస్యంగా సభావేదిక వద్దకు విజయ్ రావడం వల్లే జనం చూసేందుకు ఎగబడి తొక్కిసలాట జరిగిందని పోలీసులు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు
భారత్లో ప్రవేశించేందుకు చైనా మహిళ యత్నం.. అరెస్ట్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి