రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:50 AM
NEET పరీక్ష వ్యవహారం, పేపర్ లీక్ల అంశంపై పార్లమెంట్ వేదికగా ఓపెన్ డిబేట్కు సిద్ధమా? అని BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విపక్షాలకు సవాల్ విసిరారు. సభ ముందుకు వస్తే వారి 'ద్వంద్వ నీతి' బయటపడుతుందనే వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీ, జులై 23: దేశంలో ప్రకంపనలు పుట్టిస్తోన్న NEET పరీక్ష వ్యవహారం, పేపర్ లీక్ల అంశంపై పార్లమెంట్ వేదికగా ఓపెన్ డిబేట్కు సిద్ధమా? అని భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విపక్షాలకు సవాల్ విసిరారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష కూటమి పార్లమెంట్లో చర్చకు రాకుండా పారిపోతోందని, సభ ముందుకు వస్తే వారి 'ద్వంద్వ నీతి' బయటపడుతుందనే భయంతోనే వెనకడుగు వేస్తున్నారని నితిన్ నబిన్ ఆరోపించారు.
'రాహుల్ గాంధీది పారిపోయే రాజకీయ చరిత్ర'
పేపర్ లీక్ దోషులకు కఠిన శిక్షలు ఖరారు చేసేందుకు 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన అనంతరం రాహుల్ గాంధీ తీవ్ర విమర్శల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన నితిన్ నబిన్ ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
'విద్యార్థులు, యువత భవిష్యత్తుకు సంబంధించి ప్రతి అంశంపైనా లోక్సభలో చర్చించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉంది. NEET సహా ఏ అంశంపైనైనా చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా? పార్లమెంట్ వేదికగా చర్చకు రావాలని రాహుల్ గాంధీకి సవాల్ విసురుతున్నాం' అని ఆయన అన్నారు.
'రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానం అంతా పారిపోవడమే. దాదాపు 50-60 ఏళ్లుగా యువతను వంచించడం, రెచ్చగొట్టడం, దారి మళ్లించడమే కాంగ్రెస్ చరిత్ర. అందుకే సభలో చర్చకు వస్తే తమ రంగు బయటపడుతుందని భయపడుతున్నారు' అని ఆయన ఎద్దేవా చేశారు.
విపక్షాలు యువతను కేవలం నిరసనకారులుగా, 'రాళ్లు విసిరేవారిగా' మాత్రమే చూశాయని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యువతకు సురక్షితమైన, ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ట్రేడింగ్ పేరుతో రూ.15 కోట్లకు టోకరా
రాష్ట్రంలో మరో 4 కొవిడ్ కేసులు