బిహార్ మధేపురాలోని సింఘేశ్వర ఆలయం వద్ద తోపులాట.. భక్తులకు గాయాలు..
ABN , Publish Date - Aug 24 , 2026 | 01:35 PM
బిహార్లోని మధేపురాలో ఉన్న సింఘేశ్వర ఆలయం వద్ద సోమవారం ఉదయం తొక్కిసలాట లాంటి పరిస్థితి తలెత్తింది. శ్రావణ సోమవారం కావడంతో సింఘేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అయితే..
బిహార్: మధేపురాలోని సింఘేశ్వర ఆలయం వద్ద ఇవాళ (సోమవారం) ఉదయం తొక్కిసలాట లాంటి పరిస్థితి తలెత్తింది. శ్రావణ సోమవారం కావడంతో సింఘేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్దఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అయితే, భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు ఏర్పాటు చేసిన ఓ బారికేడ్ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
వెంటనే తొక్కిసలాట వంటి పరిస్థితి నెలకొంది. ఒకరినొకరు తోసుకోవడంతో సుమారు ఆరుగురు భక్తులు గాయపడ్డారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం మధేపురాలోని జననాయక్ కర్పూరి ఠాకూర్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ, మేజిస్ట్రేట్ అభిషేక్ రంజన్ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు, అదనపు బలగాలను కూడా మోహరించారు. పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకువచ్చారు. అధికారులు నిర్దేశించిన మార్గదర్శకాలను భక్తులు పాటించాలని, ప్రశాంతంగా ఉండాలని ఆలయ ట్రస్ట్ కమిటీ కోరింది.
కాగా, గత సోమవారం లఖిసరాయ్ జిల్లాలోని అశోక్ ధామ్ ఆలయం వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. భారీ జనసందోహానికి తోడు విద్యుత్ స్తంభం కూలిపోయిందనే వదంతి కారణంగా తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టుకు జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్.. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని పిటిషన్..
సీఎం విజయ్ సంచలన ప్రకటన.. పొంగల్ నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..