Share News

అమిత్‌షాను కలిసిన అన్నామలై.. ఊపందుకున్న కొత్త పార్టీ ప్రచారం

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:37 PM

తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను మంగళవారంనాడిక్కడ కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌లతో తొలుత సమావేశమైన అన్నామలై తన రాజీనామా పత్రాన్ని వారికి సమర్పించారు.

అమిత్‌షాను కలిసిన అన్నామలై.. ఊపందుకున్న కొత్త పార్టీ ప్రచారం
Annamalai with Amit Shah

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shan)ను మంగళవారంనాడిక్కడ కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌లతో తొలుత సమావేశమైన అన్నామలై తన రాజీనామా పత్రాన్ని వారికి సమర్పించారు. ఆ వెంటనే అమిత్‌షాను కూడా కలుసుకోవడంతో ఆయన కొత్త పార్టీని స్థాపించేందుకు నిశ్చయించుకున్నారనే ఊహాగానాలు మరింత ఊపందుకుంటున్నాయి. అయితే కొత్త పార్టీ ఆలోచనను అన్నామలై ఇంతవరకూ అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు.


న్యూఢిల్లీ పర్యటనలో అన్నామలైను పార్టీలోనే కొనసాగాలని బీజేపీ అధిష్ఠానం కోరిందని, రాజ్యసభ సీటు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేంతవరకూ ఢిల్లీలోనే ఉండాలని సూచించిందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అన్నామలై సైతం తన నిర్ణయాన్ని రెండ్రోజుల్లో తెలియజేస్తానని ఢిల్లీకి బయలుదేరే ముందు చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


మరోవైపు, అన్నామలై మరో కొత్త అవతారం ఎత్తాలని, తమిళనాడును కాపాడాలని కోరుతూ మదురై, కోయంబత్తూరులో రెండ్రోజుల క్రితం పోస్టర్లు వెలిసాయి. జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజున ఆయన నుంచి ఒక కీలక ప్రకటన ఉంటుందని అన్నామలై అనుచరులు చెబుతున్నారు. అన్నామలై గత కొంతకాలంగా పలు అంశాల విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై మొదట్నించీ ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీ టిక్కెట్‌ను కూడా నిరాకరించి ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యారు. అయితే ప్రచారంలోనూ ఆయనను పార్టీ పెద్దగా పట్టించుకోలేదని అన్నామలై వర్గీయులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ త్రిభాషా విధానంతో అన్నామలై బహిరంగంగానే విభేదించారు. ఈ విధానం వల్ల విద్యార్థులకు ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని, తక్షణమే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర విద్యాశాఖను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన కోరారు. ఈ క్రమంలో సుహృద్భావ వాతావరణంలోనే పార్టీ నుంచి తప్పుకుని సొంత మార్గాన్ని ఎంచుకోవాలని అన్నామలై గట్టి నిశ్చయానికి వచ్చినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

అనవసర బలవంతం తగదు.. వందేమాతరం పూర్తి గేయంపై శశిథరూర్

టార్గెట్ దాడులపై కోల్‌కతాలో మమత బైఠాయింపు నిరసన

Updated Date - Jun 02 , 2026 | 06:37 PM