అనవసర బలవంతం తగదు.. వందేమాతరం పూర్తి గేయంపై శశిథరూర్
ABN , Publish Date - Jun 02 , 2026 | 03:10 PM
కేరళలో 'వందేమాతరం' గేయంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం గేయంలోని ఐదు చరణాలతో పూర్తి గేయాన్ని పాడాలని ఆదేశించడం అనవసరమైన బలవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.
తిరువనంతపురం: కేరళలో 'వందేమాతరం' గేయంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ (Sashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం గేయంలోని ఐదు చరణాలతో పూర్తి గేయాన్ని పాడాలని ఆదేశించడం అనవసరమైన బలవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. వందేమాతరం గేయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని, అయితే ప్రతి కార్యక్రమంలోనూ పూర్తి గేయం పాడాలంటూ తప్పనిసరి చేయడాన్ని సమర్థించడం కష్టమని అన్నారు.
'వందేమాతరం జాతీయ గేయం. దీనిని ఆలపించేటప్పుడు గౌరవంతో లేచి నిలబడతాం. మొదటి రెండు శ్లోకాలు జాతీయగీతానికి సమానమైన గౌరవాన్ని ఇస్తాయి. చాలా మందికి నోటికి కూడా వచ్చి ఉంటుంది' అని శశిథరూర్ పేర్కొన్నారు. సాంప్రదాయబద్ధంగా వందేమాతరం గేయాన్ని కార్యక్రమం ప్రారంభంలో పాడతారని, జాతీయగీతాన్నిచివర్లో పాడతారని అన్నారు. అయితే ఇప్పుడు వందేమాతరం గేయంలోని ఐదు శ్లోకాలను ఈవెంట్ ప్రారంభంలో, మళ్లీ చివరల్లో పాడాలని అంటున్నారనీ, ఇది బలవంతంగా రుద్దడమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఐదు శ్లోకాలు పాడటం ఐచ్ఛికమని కేరళ ప్రభుత్వం అంటోందని, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తోందని శశిథరూర్ అన్నారు. జాతీయ గీతం ఎంత సమయంలో పూర్తవుతుందో దాదాపు అంతే సమయంలో పూర్తయ్యే మొదటి రెండు శ్లోకాలతో వందేమాతరం గేయం పాడటాన్ని జనం అంగీకరించడం, గౌరవించడం జరుగుతోందని అన్నారు. ఐదు శ్లోకాలతో పూర్తి గేయం తప్పనిసరి చేయడంపై వివాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమని, దీనికి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
బీజేపీ స్పందన
శశిథరూర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించారు. వందేమాతరం గేయం పూర్తి స్థాయిలో పాడటం ఐచ్ఛికం కాదని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకోరాదని అన్నారు. దీనికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీకి తమిళనాడు నేత అన్నామలై రాజీనామా
టీఎంసీ రెబల్స్ కొత్త పార్టీ.. తెరపైకి ‘అస్లీ తృణమూల్’..