గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:44 AM
గగనతలంలో ఉన్నట్టుండి ఒకేసారి 300 అడుగులు కిందకు పడిపోయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో.. పైలట్ గంజాయి సేవించినట్టు రెండో విడత నిర్వహించిన డోప్ పరీక్షలో నిర్ధారణ అయింది.
న్యూఢిల్లీ : గగనతలంలో ఉన్నట్టుండి ఒకేసారి 300 అడుగులు కిందకు పడిపోయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో.. పైలట్ గంజాయి సేవించినట్టు రెండో విడత నిర్వహించిన డోప్ పరీక్షలో నిర్ధారణ అయింది. 137 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో ఈ నెల 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా (ఏఐ-2379) ఎయిర్బస్ 320 విమానం, ఒడిశా గగనతలంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి 300 అడుగులు కిందకు పడిపోవడం తెలిసిందే. తీవ్ర కుదుపుల కారణంగా 24 మంది గాయపడ్డారు.
విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే పైలట్కు ప్రాథమికంగా నిర్వహించిన స్ర్కీనింగ్ పరీక్షలో (డోప్ టెస్ట్) పాజిటివ్గా తేలడం తెలిసిందే. అనంతరం ల్యాబ్లో నిర్వహించిన కన్ఫర్మేటరీ డోప్ టెస్ట్ (ధృవీకరణ)లో పైలట్ గంజాయి తాగినట్టు తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన సమయంలో పైలట్కు బదులు కోపైలట్ విమానాన్ని నడుపుతున్నాడని తెలిపాయి. ఏఏఐబీతోపాటు ఎయిర్బస్ బృందం దీనిపై విచారణ నిర్వహిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
వైసీపీ పట్ల భవిష్యత్లో జాగ్రతగా ఉండకపోతే.. తీవ్ర ఇబ్బందులు: మంత్రి అచ్చెన్న
ఓటు తొలగించటంపై వ్యంగ్యంగా స్పందించిన ప్రకాశ్ రాజ్