వైసీపీ పట్ల భవిష్యత్లో జాగ్రతగా ఉండకపోతే.. తీవ్ర ఇబ్బందులు: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Aug 11 , 2026 | 01:32 PM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ‘అక్వా రంగం’ మానస పుత్రిక అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం పాలకొల్లులో అక్వా సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు.
భీమవరం, ఆగస్టు 11: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ‘అక్వా రంగం’ మానస పుత్రిక అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం పాలకొల్లులో అక్వా సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, మన రాష్ట్రం పేరు చెబితే అందరూ అసహ్యించుకునే పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరే సమయానికి రాష్ట్ర ఖజనా ఖాళీ అయిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని వివరించారు.
ప్రస్తుతం మన రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తుందని చెప్పారు. 2019లో ఆవేశానికి లోనై ఓ దొంగను, ఓ దోపిడీదారుడిని, ఓ గొడ్డలి పార్టీని అధికారంలోకి తెచ్చారని అన్నారు. గొడ్డలి పార్టీకి స్వేచ్ఛ ఇస్తే.. రాజ్యాంగాన్ని గౌరవించి అధికారం ఇస్తే సర్వ నాశనం చేశాడంటూ వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. ఇటువంటి పార్టీ పట్ల భవిష్యత్లో జాగ్రతగా ఉండకపోతే.. తీవ్ర ఇబ్బందులు పడతామని ప్రజలను ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
అక్వా రంగాన్ని నాశనం చేసిన వ్యక్తి, పరామర్శ పేరుతో రైతుల దగ్గరకు వస్తే, ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా? అని ప్రజలను ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్ హయాంలో అక్వా ఫీడ్కు అవసరమైన వస్తువుల ధరలు పెరగక పోయినా.. వాటి ధరలు ఆరు సార్లు పెంచారని చెప్పారు. త్వరలో ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్ ధరలను 50 శాతం తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అదే జరిగితే అక్వా ఫీడ్ ధరలు తగ్గుతాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.