తమిళనాడులో అద్భుతం జరగబోతోంది.. AIADMK సీనియర్ నేత అన్బళగన్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - May 07 , 2026 | 07:06 PM
అనిశ్చితికి తెరదించుతూ తమిళనాడులో AIADMK త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ సీనియర్ నేత అన్బళగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా తమిళనాడులో ఒక 'అద్భుతం' జరగబోతోందని ఆయన ఆన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతున్నాయి.
చెన్నై, మే 7: తమిళనాడు రాజకీయ వేదికపై మళ్ళీ 'రిసార్టు రాజకీయాలు' వేడెక్కాయి. గత కొద్దిరోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, AIADMK త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అన్బళగన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా ఒక 'అద్భుతం' జరగబోతోందని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
118 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకే!
అన్బళగన్ మీడియాతో మాట్లాడుతూ.. 'మాకు ప్రస్తుతం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తోంది. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఇతర పక్షాల మద్దతు కూడా మాకు లభించబోతోంది' అని ఆయన పేర్కొన్నారు.
మళ్ళీ తెరపైకి రిసార్టు రాజకీయాలు
ప్రభుత్వ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్న AIADMK, తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. సీనియర్ నేతల పర్యవేక్షణలో సుమారు 27 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ రిసార్టుకు చేరుకున్నారు. సీవీ షణ్ముగం నేతృత్వంలో మిగతా ఎమ్మెల్యేలను మరొక రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. తమ ఎమ్మెల్యేలపై ఒత్తిడి రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
గవర్నర్ నిర్ణయంపైనే అందరి కళ్లు
మరోవైపు, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు ఇప్పటికే రాష్ట్రంలోని పరిస్థితులపై స్పందిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉత్కంఠ భరిత పోరులో గవర్నర్ ఎవరిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తారు? అన్బళగన్ చెప్పిన ఆ 'అద్భుతం' ఏ రూపంలో ఉండబోతోంది? అనేది హాట్ టాపిక్ గా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్
హైదరాబాద్లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
Read Latest Telangana News And Telugu News