130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్.. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టకూడదని నిర్ణయం..
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:41 PM
దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఈ వివాదాస్పద బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకూడదని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.
ఢిల్లీ: దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఈ వివాదాస్పద బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకూడదని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. బిల్లుపై అధ్యయనం చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదిక సమర్పణకు మరికొంత సమయం కావాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ అనెక్స్లో బీజేపీ ఎంపీ, జేపీసీ ఛైర్పర్సన్ అపరాజిత సారంగి అధ్యక్షతన ఇవాళ (శుక్రవారం) కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025పై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, న్యాయపరమైన చిక్కులు, రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించేందుకు మరింత సమయం అవసరమని కమిటీ అభిప్రాయపడింది. దీంతో అదనపు సమయం కోసం కేంద్రాన్ని కోరింది.
ఏమిటీ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు?
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు, అరెస్టుల అంశానికి సంబంధించి కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. బిల్లు ప్రకారం.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులు 30 రోజుల పాటు జైలులో ఉండి బెయిల్ పొందలేని పరిస్థితి ఏర్పడితే పదవులు కోల్పోయే విధంగా నిబంధనలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించగా.. అధికార పక్షం మాత్రం పాలనలో పారదర్శకత, నైతికత పెంచేందుకు ఈ మార్పులు అవసరమని వాదిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసు.. 973 పేజీల ఛార్జ్షీట్ దాఖలు