IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ..ఒకే ట్రిప్లో 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలు..
ABN , Publish Date - Jul 03 , 2026 | 04:06 PM
దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక విమాన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' పేరుతో 7 రోజుల యాత్రను అందుబాటులోకి తెచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక విమాన టూర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీ ద్వారా దక్షిణ భారతంలోని ప్రముఖ దేవాలయాలను ఒకే యాత్రలో దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల ఈ టూర్లో మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచ్చి, త్రివేండ్రం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ యాత్ర ఆగస్టు 16న హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో మొదలు కానుంది. ప్యాకేజీ ధరలు రూ.37,700 నుంచి ప్రారంభమవుతున్నాయి.
యాత్ర షెడ్యూల్ ఇలా ఉంటుంది
మొదటి రోజు:
హైదరాబాద్ నుంచి ఉదయం విమానంలో బయలుదేరి త్రివేండ్రం చేరుకుంటారు. హోటల్లో చెక్-ఇన్ అనంతరం అల్పాహారం చేసి పువార్ ఐలాండ్, అజిమల శివాలయాన్ని సందర్శిస్తారు. రాత్రి అక్కడే బస ఉంటుంది.
రెండో రోజు:
ఉదయం శ్రీ పద్మనాభస్వామి ఆలయ దర్శనం అనంతరం కన్యాకుమారికి ప్రయాణం. సాయంత్రం సూర్యాస్తమయాన్ని వీక్షించి అక్కడే బస చేస్తారు.
మూడో రోజు:
రాక్ మెమోరియల్, తిరువళ్లువర్ విగ్రహాన్ని సందర్శించిన తర్వాత రామేశ్వరానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస ఉంటుంది.
నాలుగో రోజు:
రామేశ్వరం ఆలయం, ధనుష్కోటి ప్రాంతాలను సందర్శిస్తారు. స్థానిక దర్శనాల కోసం అవసరమయ్యే అదనపు వాహన ఖర్చులు యాత్రికులే భరించాలి.
ఐదో రోజు:
అబ్దుల్ కలాం స్మారక స్థలాన్ని సందర్శించిన అనంతరం తంజావూరుకు వెళ్లి బృహదీశ్వర ఆలయాన్ని దర్శిస్తారు. తర్వాత తిరుచ్చికి చేరుకుని అక్కడే బస చేస్తారు.
ఆరో రోజు:
శ్రీరంగం ఆలయం దర్శనం తర్వాత మదురైకి బయలుదేరుతారు. సాయంత్రం షాపింగ్కు సమయం కేటాయిస్తారు.
ఏడో రోజు:
మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం అనంతరం మదురై విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంత్రానికి యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు
సింగిల్ ఆక్యుపెన్సీ – రూ.52,550
డబుల్ ఆక్యుపెన్సీ – రూ.39,850
ట్రిపుల్ ఆక్యుపెన్సీ – రూ.37,700
5–11 ఏళ్ల పిల్లలు (బెడ్తో) – రూ.33,000
5–11 ఏళ్ల పిల్లలు (బెడ్ లేకుండా) – రూ.28,700
2–4 ఏళ్ల చిన్నారులు – రూ.21,400
ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?
ఈ టూర్లో హైదరాబాద్–త్రివేండ్రం, మదురై–హైదరాబాద్ విమాన టికెట్లు, నిర్ణీత హోటళ్లలో బస, రోజు అల్పాహారం, ఎంపిక చేసిన రోజుల రాత్రి భోజనం, స్థానిక ప్రయాణాలకు ఏసీ బస్సు, అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు.
Also Read:
రెడీమేడ్ అల్లం-వెల్లుల్లి పేస్ట్కు గుడ్బై.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
కాల్షియం లోపమే కాదు.. ఈ అలవాట్లు కూడా ఎముకలను బలహీనపరుస్తాయి!