తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం IRCTC స్పెషల్ ఆఫర్
ABN , Publish Date - Feb 28 , 2026 | 04:57 PM
తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తులకు IRCTC స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. మార్చి 21 నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లను నడపనుంది.
ఇంటర్నెట్ డెస్క్: తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే భక్తులకు IRCTC శుభవార్త చెప్పింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ సేవలను మార్చి 21 నుంచి ప్రారంభించనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. జూన్ 3 వరకు తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం నాలుగు ప్రత్యేక యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఈ ప్రత్యేక రైళ్లు హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి బయలుదేరి దేశంలోని దక్షిణ, పశ్చిమ, ఉత్తర భారత ప్రాంతాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తాయి. యాత్రికులకు రైలు ప్రయాణంతో పాటు హోటల్ వసతి, భోజనం, స్థానిక రవాణా, దర్శనాల కోసం గైడ్ సదుపాయం, అలాగే ప్రయాణ బీమా వంటి సౌకర్యాలను ఒకే ప్యాకేజీలో అందిస్తారు.
నాలుగు ప్రత్యేక యాత్ర ప్యాకేజీలు ఇవే:
జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర
మార్చి 21–28, మే 24–31 తేదీల్లో ఈ యాత్ర ఉంటుంది. తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి వంటి పవిత్రక్షేత్రాలను దర్శించే అవకాశం కల్పిస్తారు. స్లీపర్, 3ఏసీ, 2ఏసీ తరగతుల్లో వివిధ ధరలతో సౌకర్యాలు ఉంటాయి. ఛార్జీలు రూ.14,700 నుంచి రూ.28,700 వరకు ఉంటాయి. సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేవులలో బోర్డింగ్ అందుబాటులో ఉంటుంది.

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర
ఏప్రిల్ 14 నుంచి 24 వరకు జరిగే ఈ యాత్రలో ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్, నాసిక్, ఔరంగాబాద్ వంటి ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించవచ్చు. ఛార్జీలు రూ.17,600 నుంచి రూ.34,600 వరకు ఉంటాయి. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్లో బోర్డింగ్ అందుబాటులో ఉంటుంది.

అయోధ్య- కాశీ- బైద్యనాథ్ ధామ్ యాత్ర
ఏప్రిల్ 28 –మే 5, జూన్ 3–12 తేదీల్లో ఈ యాత్ర ఉంటుంది. ఇందులో అయోధ్య, పూరి, వారణాసి, కోణార్క్, ప్రయాగ్రాజ్ వంటి ముఖ్య క్షేత్రాలు ఉన్నాయి. ఛార్జీలు రూ.16,700 నుంచి రూ.34,100 వరకు ఉంటాయి.

హరిద్వార్- మాతా వైష్ణో దేవి- రిషికేశ్ యాత్ర
మే 12 నుంచి 21 వరకు జరిగే ఈ యాత్రలో హరిద్వార్, మాతా వైష్ణో దేవి, రిషికేశ్, మధుర, బృందావన్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఛార్జీలు రూ.16,500 నుంచి రూ.33,400 వరకు ఉంటాయి.

బుకింగ్ వివరాలు
ఈ యాత్రలకు ఆసక్తి ఉన్నవారు IRCTC టూరిజం అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు. పూర్తి సౌకర్యాలతో తక్కువ ఖర్చులో పుణ్యక్షేత్రాల దర్శనం చేయాలనుకునే భక్తులకు ఈ ప్యాకేజీలు మంచి అవకాశం కల్పిస్తున్నాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి
కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?
For More Latest News