ఒకరు కాదు, చాలా మందితో మాట్లాడాం.. ఇరాన్ నేతలతో చర్చలపై ట్రంప్
ABN , Publish Date - Mar 23 , 2026 | 09:22 PM
పశ్చిమాసియాలో యుద్ధాన్ని నిలిపివేసే విషయమై రెండ్రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారంనాడు ప్రకటించడం, అలాంటిదేమీ లేదంటూ ఇరాన్ తోసిపుచ్చడంపై తాజాగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని నిలిపివేసే విషయమై రెండ్రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సోమవారంనాడు ప్రకటించడం, అలాంటిదేమీ లేదంటూ ఇరాన్ తోసిపుచ్చడంపై తాజాగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇరాన్ స్పందన అనంతరం తాజాగా మరోసారి ట్రంప్ స్పందించారు. ఇరాన్లో ఒక నాయకుడు కాదు, చాలా మంది నేతలతో యూఎస్ మాట్లాడుతోందని ఆయన తెలిపారు. చర్చలకు చొరవ తీసుకున్నది కూడా తాను కాదని, రెండో వైపు నుంచే ప్రతిపాదన వచ్చిందని అన్నారు.
'నేను వారిని పిలవలేదు. వారే మాట్లాడారు. ఒక డీల్ కుదుర్చుకోవాలని కోరుకుంటునట్టు చెప్పారు. అందుకు మేము కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పాం' అని మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ చెప్పారు. ఒక అగ్రనేతతో చర్చలు జరుగుతున్నాయని, అయితే ఆయన ఆదేశ సుప్రీం లీడర్తో మాత్రం కాదని అన్నారు. ఆయన(మొజ్తాబా) గురించి ఎవరికీ తెలియదని, ఆయన బతికున్నారో లేదో కూడా తమకు తెలియదని చెప్పారు. ఆయన చనిపోవాలని కూడా తాను కోరుకోవడం లేదని, అయితే ప్రస్తుతం ఆ జాబ్ ఎవరూ కోరుకోరని వ్యాఖ్యానించారు. ఇరాన్లోని ఫేజ్-1 నాయకత్వం, ఫేజ్-2, ఫేజ్-3లో కూడా చాలామందిని తాము మట్టుబెట్టామని, అయితే అందరూ గౌరవించే ఒక నాయకుడితో తాము చర్చలు జరినట్టు చెప్పారు. ఆయన ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి..
5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్