ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:01 PM
గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇరుగుపొరుగు దేశాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. అయితే ఆయా దేశాలు తమ భూభాగాల నుంచి ఇరాన్పై దాడిని ప్రారంభించకుంటే తాము కూడా దాడి చేయమని అన్నారు.
టెహ్రాన్: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ (Masoud Pezeshkian) క్షమాపణలు చెప్పారు. ఇరుగుపొరుగు దేశాలపై క్షిపణలు, డ్రోన్ దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. అయితే ఆయా దేశాలు తమ భూభాగాల నుంచి ఇరాన్పై దాడిని ప్రారంభించకుంటే తాము కూడా దాడి చేయమని అన్నారు. ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ దేశం తాజా ప్రకటనతో ఉద్రిక్తతలు సడలే అవకాశం ఉంది.
ఘర్షణల కారణంగా పొరుగుదేశాల్లో అనిశ్చితి తలెత్తడంపైనా పెజిష్కియాన్ క్షమాపణలు చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలో సంక్షోభం మరింత విస్తరించాలని ఇరాన్ కోరుకోవడం లేదని అన్నారు. 'ఇరాన్ జరిపిన దాడులకు పొరుగు దేశాలకు వ్యక్తిగతంగా, ఇరాన్ తరఫున క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను' అని ఆయన పేర్కొన్నట్టు ఏఎఫ్పీ వార్తా సంస్థ తెలిపింది.
లొంగిపోయే ప్రసక్తే లేదు..
పొరుగుదేశాలపై దాడులు చేయమని ఇరాన్ అధ్యక్షుడు ఓవైపు చెబుతూనే మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు తలవంచే ప్రసక్తే లేదని చెప్పారు. ఇరాన్ ప్రజలు ఎన్నడూ లొంగిపోరని, ఇరాన్ను లొంగదీసుకోవచ్చని అనుకునే వాళ్లు ఎప్పటికీ సక్సెస్ కారని, తమ దేశాన్ని తాము కాపాడుకుంటామని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కాగా, పొరుగుదేశాలపై దాడి చేయమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించినప్పటికీ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాల్లో పేలుళ్లు వినిపిస్తున్నాయి. క్షిపణులు, డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు అడ్డుకుంటున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. విమానాశ్రయం సమీపంలో పెద్ద శబ్దం వినిపించడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆపరేషన్లను శనివారం నాడు నిలిపివేశారు. ఇది చిన్న ఘటనేనని, అయితే ప్రయాణికుల భద్రత రీత్యా విమాన సర్వీసులను రద్దు చేశామని అధికారులు తెలిపారు.
భారీగా మృతులు
తాజా ఘర్షణల్లో ప్రాణనష్టం కూడా భారీగానే ఉన్నట్టు చెబుతున్నారు. ఇరాన్లో 1,200మంది ప్రాణాలు కోల్పోగా, లెబనాన్లో సుమారు 200 మంది ఇజ్రాయెల్లో డజను మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించినట్టు చెబుతున్నారు. గల్ఫ్ వ్యాప్తంగా ఎయిర్ ట్రావెల్కు అంతరాయం కలగడంతో వేలాది విమానాలు రద్దవుతున్నాయి. క్షిపణులు, డ్రోన్ దాడుల భయంలో పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ
బ్లూ స్పారో క్షిపణితో ఖమేనీపై దాడి