మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:00 PM
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఉక్రెయిన్ గురువారం వందలాది డ్రోన్లతో మాస్కోపై భారీ దాడి చేసింది. మాస్కోలోని కీలక చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఉక్రెయిన్ గురువారం వందలాది డ్రోన్లతో మాస్కోపై భారీ దాడి చేసింది. మాస్కోలోని కీలక చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడి కారణంగా మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి. విమాన రాకపోకలు నిలిచిపోయాయి (Ukraine drone attack).
మాస్కోలోని కపోట్న్యా (Kapotnya) ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో దాడి చేసింది. దాడి అనంతరం భారీ మంటలు చెలరేగాయి. నల్లటి పొగ నగరమంతా వ్యాపించింది. ఇది వారం వ్యవధిలో కపోట్న్యా రిఫైనరీపై జరిగిన రెండో దాడి కావడం గమనార్హం. దాడి నేపథ్యంలో మాస్కోలోని షెరెమెత్యేవో, వ్నుకోవో, జూకోవ్స్కీ సహా పలువురు అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. వందలాది విమానాలు నిలిచిపోవడంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు (Moscow oil refinery).
రష్యా కొనసాగిస్తున్న దాడులకు ఇది తగిన ప్రతిస్పందన అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు (Russia Ukraine war). యుద్ధానికి మద్దతుగా నిలుస్తున్న రష్యాలోని కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్నామని ఆయన చెప్పారు. కాగా, మాస్కో వైపు వచ్చిన వందలాది డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా అధికారులు ప్రకటించారు. కాగా, గత కొద్ది నెలలుగా రష్యా చమురు, ఇంధన మౌలిక వసతులపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులను పెంచడంతో ఇంధన ఉత్పత్తి, సరఫరాపై ప్రభావం పడుతోంది.
ఇవీ చదవండి:
డీఎంకేకు మరో షాక్.! టీవీకే వైపు ఎండీఎంకే.?
బీబీ ఒకసారి ఆలోచించండి.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్