వచ్చే నెలలో కేంద్రంలో మార్పులు!
ABN , Publish Date - Aug 27 , 2026 | 05:38 AM
ప్రధాని మోదీ సెప్టెంబరు 1వ తేదీన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మోదీ ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ల పర్యటన ప్రారంభవుతుంది
మోదీ విదేశీ పర్యటన అనంతరం
క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ
కిరణ్కుమార్రెడ్డికి గవర్నర్ పదవి?
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ సెప్టెంబరు 1వ తేదీన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మోదీ ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ల పర్యటన ప్రారంభవుతుంది. ఆయన తిరిగి వచ్చిన అనంతరం అధికార యంత్రాంగంలో మార్పులతోపాటు గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు, కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకం జరుగుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి లభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ పార్లమెంటరీ బోర్డులో సభ్యత్వం ఇవ్వవచ్చని తెలుస్తోంది. కాగా మోదీ ప్రభుత్వంలో 69 మంది మంత్రులుండగా, రాజ్యాంగం ప్రకారం మరో 12 మందిని నియమించుకునేందుకు అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, 70 ఏళ్ల వయసు దాటిన 12 మందికిపైగా క్యాబినెట్, సహాయమంత్రులను తప్పించి యువతకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.