Cryogenically Frozen Cat: యజమాని ప్రేమ.. చనిపోయిన పిల్లి కోసం ఏకంగా..
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:42 PM
ఓ వ్యక్తి చనిపోయిన తన పిల్లి కళేబరాన్ని క్రయోజనికల్లీ ఫ్రోజెన్ విధానం ద్వారా భద్రపరిచాడు. ఇందుకోసం ఏకంగా 19 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: శాస్త్ర సాంకేతికత ముందెన్నడూ లేనివిధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రాణాంతకమైన ఎన్నో రోగాలకూ మందులు వచ్చేశాయి. కత్తిగాటు లేకుండా సర్జరీలు చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సైంటిస్టులు మనుషులకు మరణం లేకుండా చేయాలన్న పట్టుదలతో పరిశోధనలు చేస్తున్నారు. అంతేకాదు.. చనిపోయిన ఏ జీవినైనా తిరిగి బతికించడానికి కూడా పరిశోధనలు చేస్తున్నారు. అలా మనుషుల్ని బతికించే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది డబ్బున్న వారు నమ్ముతున్నారు. అందుకే క్రయోజనికల్లీ ఫ్రోజెన్ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు.
ఈ టెక్నాలజీ ద్వారా మృతదేహాలను లిక్విడ్ నైట్రోజన్లో మైనస్ 160 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద స్టోర్ చేస్తారు. దీంతో ఎంత కాలమైనా మృత శరీరంలోని కణాలు పాడవకుండా ఉంటాయి. స్విట్జర్లాండ్లోని ఓ కంపెనీ ఈ క్రయోజనికల్లీ ఫ్రోజెన్ సర్వీస్లను అందిస్తోంది. తాజాగా.. ఓ వ్యక్తి చనిపోయిన తన పిల్లి కళేబరాన్ని క్రయోజనికల్లీ ఫ్రోజెన్ విధానం ద్వారా భద్రపరిచాడు. ఇందుకోసం ఏకంగా రూ.19 లక్షలు వెచ్చించారాయన. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్లోని న్యూకాసిల్కు చెందిన మార్క్ మెక్అఫీ అనే వ్యక్తి ఓ పిల్లిని పెంచుకునేవాడు.
మెక్అఫీకి పిల్లితో ఎంతో అనుబంధం ఉండేది. గత సంవత్సరం అది 23 ఏళ్ల వయసులో చనిపోయింది. పిల్లి మరణంతో అతడు ఎంతో కృంగిపోయాడు. దానికి అంత్యక్రియలు నిర్వహించి వదిలేయటం మార్క్కు ఇష్టం లేకపోయింది. రానున్న రోజుల్లో వైద్యరంగం బాగా అభివృద్ది చెందుతుందని, చనిపోయిన మనుషుల్ని, జంతువుల్ని తిరిగి బతికించే టెక్నాలజీ వస్తుందని భావించాడు. చనిపోయిన తన పిల్లిని.. మరలా బతికించుకోవచ్చనే నమ్మకంతో దాని కళేబరాన్ని స్విట్జర్లాండ్లోని క్రయోజనిక్ ఫ్రోజెన్ కంపెనీకి పంపాడు. 19 లక్షల రూపాయలు ఖర్చు చేసి పిల్లి కళేబరాన్ని అక్కడ దాచాడు. చనిపోయిన తర్వాత తన శవాన్ని కూడా పిల్లితో పాటు భద్రపరుచుకుంటానని చెబుతున్నాడు మార్క్.
ఇవి కూడా చదవండి
వార్నీ.. రీల్స్ కోసం ఇంతకు తెగిస్తారా.. మెట్రో రైల్లో ఎగిరి తంతే..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్