Share News

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:25 PM

భారత నౌకలు హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించింది. దీంతో మన దేశానికి చెందిన రెండు నౌకలు వెంటనే ఆ జలమార్గాన్ని దాటాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమయ్యాక తొలిసారిగా ఆ జలసంధిని దాటిన నౌకలు భారత్‌కు చెందినవే కావడం విశేషం.

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్
Hormuz Strait

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇరాన్ ఉపశమనం కలిగించింది. భారతీయ ట్యాంకర్లను హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య జరిగిన చర్చల అనంతరం.. భారత జెండాలు కలిగిన నౌకలకు టెహ్రాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామంతో అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కుంటున్నప్పటికీ.. పుష్పక్, పరిమళ్ అనే రెండు భారతీయ ట్యాంకర్లు వ్యూహాత్మకంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్టు పేర్కొన్నాయి.


అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణంపై ఇరాన్ ఆంక్షలు విధించింది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు సంబంధంలేని నౌకలకు మాత్రం ఆంక్షల నుంచి సడలింపునిచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా భారతీయ నౌకలు జలమార్గం గుండా సురక్షితంగా ప్రయాణించడం విశేషం.


ఇరాన్‌ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ తాజా చర్చతో సహా జైశంకర్ - అరాగ్చీల మధ్య మూడుసార్లు చర్చలు జరిగాయి. హోర్ముజ్ జలసంధి నుంచి ట్యాంకర్లను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంపై ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ప్రధానంగా సంభాషించినట్టు తెలుస్తోంది. ఇక.. జైశంకర్ బుధవారం నాడు రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు సహా పలువురు ఐరోపా నేతలతోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను చర్చించినట్టు సమాచారం.


ఇవీ చదవండి:

హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..

ఆ ముగ్గురినీ పక్కన పెట్టండి.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదంపై సుప్రీం కోర్టు

Updated Date - Mar 12 , 2026 | 12:48 PM