బంగ్లాదేశ్ ఎన్సీపీ ర్యాలీలో పేలుడు, ముగ్గురికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Jul 07 , 2026 | 08:36 AM
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్లో తీవ్ర కలకలం రేగింది. విద్యార్థుల నేతృత్వంలోని ప్రముఖ రాజకీయ పార్టీ NCP నిర్వహించిన బహిరంగ సభలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
ఢాకా, జులై 7: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్ (Savar) లో తీవ్ర కలకలం రేగింది. విద్యార్థుల నేతృత్వంలోని ప్రముఖ రాజకీయ పార్టీ 'నేషనల్ సిటిజన్ పార్టీ' (NCP) నిర్వహించిన బహిరంగ సభలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వేదికపై నుంచి నాయకులు ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ పేలుడు జరగడంతో అక్కడ ఉన్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు.
మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఎన్సీపీ పార్టీ దేశవ్యాప్తంగా ‘జూలై మార్చ్’ (July March) పేరిట పొలిటికల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శన ముగిసిన అనంతరం సావర్ ఠానా స్టాండ్ ఈద్గా మైదానంలో సోమవారం రాత్రి 9:45 గంటల ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఢాకా జిల్లా ఎన్సీపీ కన్వీనర్ నబిలా తస్నీమ్ వేదికపై ప్రసంగిస్తుండగా, స్టేజ్ సమీపంలోనే ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రమాద సమయంలో వేదికపై ఎన్సీపీ ముఖ్య నేతలు నాహిద్ ఇస్లాం, అక్తర్ హుస్సేన్, సర్జిస్ ఆలమ్ తదితరులు ఉన్నట్లు సమాచారం.
ఈ దాడిపై ఎన్సీపీ పార్టీ సోమవారం అర్ధరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. 'సావర్లో ఎన్సీపీ మార్చ్ ముగింపు సభ జరుగుతుండగా ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగానే బాంబు దాడికి పాల్పడ్డారు. మా శాంతియుత ప్రదర్శనను భగ్నం చేసేందుకే ఈ కుట్రకు ఒడిగట్టారు' అని పార్టీ ప్రతినిధులు ఆరోపించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఎండీ షాహిన్ ఖందకర్, ఎండీ జసీమ్, ఎండీ షహదత్ హుస్సేన్లుగా గుర్తించారు. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం ఎనామ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి సమాచారం అందిన వెంటనే ఎన్సీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు.
ఈ బాంబు పేలుడు ఘటనకు కొద్దిరోజుల ముందే ఢాకా సమీపంలో మరో పెద్ద విషాదం చోటుచేసుకుంది. కేరళీగంజ్ పరిధిలోని కాదమ్తలి ప్రాంతంలో ఉన్న ఒక గ్యాస్ లైటర్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవదహనమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
అమ్మేవాడు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News