పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 25మంది దుర్మరణం
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:47 PM
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. షెహజాద్ టౌన్ ఏరియా టేర్లాయీ ఇమామ్ బారగాహ్ వద్ద జరిగిన ఈ పేలుడులో 25 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. షెహజాద్ టౌన్ ఏరియా టేర్లాయీ ఇమామ్ బారగాహ్ వద్ద జరిగిన ఈ పేలుడులో సుమారు 25మంది మరణించగా.. 80 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇది ఆత్మాహుతి బాంబర్ దాడిగా అనుమానిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పెద్దఎత్తున భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని తక్షణ సహాయక చర్చలు చేపట్టాయి. క్షతగాత్రులను పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్చలు కొనసాగుతున్నాయి.
శుక్రవారం నాడు ప్రార్థనల అనంతరం ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్టు చెబుతున్నారు. ఇది బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పనిగా అనుమానిస్తున్నారు. దాడి నేపథ్యంలో ఇస్లామాబాద్లో అత్యవసర పరిస్థితిని అధికారులు ప్రకటించారు. గత మూడు నెలల్లో ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడులు జరగడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్లో ఇస్లామాబాద్ జిల్లా జ్యుడిషియల్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించగా.. 27 మంది గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
ఎయిర్ ఫోర్స్ వన్లో నేను నిద్రపోను: డొనాల్డ్ ట్రంప్
వెనెజువెలా చమురుకు రిలయన్స్ ఆర్డర్!