ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి.. ఆంథ్రోపిక్ సీఈఓకు మస్క్, ఆల్ట్మన్ మద్దతు..
ABN , Publish Date - Sep 13 , 2026 | 07:47 AM
ప్రపంచాన్ని మార్చేస్తుందని భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి వేగంపై ముగ్గురు ప్రముఖ టెక్ దిగ్గజాలు ఒకే అభిప్రాయానికి వచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని మార్చేస్తుందని భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి వేగంపై ముగ్గురు ప్రముఖ టెక్ దిగ్గజాలు ఒకే అభిప్రాయానికి వచ్చారు. ఏఐ మోడళ్ల సామర్థ్యాలను పెంచే వేగాన్ని కొంత తగ్గించాల్సిన అవసరం ఉందని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ (Dario Amodei) పిలుపు ఇచ్చారు. ఈ సూచనకు ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, ఎక్స్ఏఐ అధినేత ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. ఏఐ రంగంలో తీవ్రంగా పోటీ పడుతున్న ఈ ముగ్గురు కీలక నాయకులు భద్రత విషయంలో ఒకే వైపు నిలిచారు.
ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ తన తాజా బ్లాగ్లో ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. సాంకేతిక పురోగతి ఆగిపోవాలని తాను కోరుకోవడం లేదని, అయితే అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలు అభివృద్ధి చెందేందుకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు (Artificial intelligence risks).
ఆంథ్రోపిక్ ప్రత్యర్థి సంస్థ అయిన ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ కూడా అమోడెయ్ అభిప్రాయాన్ని సమర్థించారు. 'నేను డారియోతో ఏకీభవిస్తున్నాను. మనం ఫ్రాంటియర్ను కొంత నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాలి' అని ఆల్ట్మన్ ఎక్స్లో పేర్కొన్నారు. స్వతంత్ర భద్రతా పరిశీలకులకు తమ సంస్థలో ఉద్యోగుల స్థాయిలో యాక్సెస్ కల్పించే విధానాన్ని ఓపెన్ఏఐ కూడా అనుసరించనున్నట్లు ఆయన తెలిపారు. అంటే అత్యంత అధునాతన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్న సంస్థల భద్రతా విధానాలను బయటివారు స్వతంత్రంగా పరిశీలించే అవకాశం కల్పించాలన్నది ఈ ప్రతిపాదనలో కీలక అంశం (Sam Altman AI).
ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్ కూడా అమోడెయ్కు మద్దతు తెలిపారు. 'డారియో చెప్పింది నిజమే' అంటూ మస్క్ స్పందించారు (Elon Musk AI). ఏఐ సామర్థ్యాల అభివృద్ధి వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముందుగా భద్రతా ప్రమాణాలను బలోపేతం చేసి, ఆ తర్వాత అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని కొనసాగించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ ముగ్గురూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
త్వరలో భారత మార్కెట్లోకి కోహియర్